మావోయిస్టు ఆయుధ తయారీ కేంద్రంపై దాడి

మావోయిస్టు ఆయుధ తయారీ కేంద్రంపై దాడి
  • కర్రెగుట్టల్లో భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్న జవాన్లు

భద్రాచలం, వెలుగు: తెలంగాణ బార్డర్​లోని ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​ జిల్లా కర్రెగుట్టల్లో మంగళవారం సీఆర్పీఎఫ్​ జవాన్లు మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. జవాన్ల రాకను గమనించిన మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సీఆర్పీఎఫ్​కు చెందిన కోబ్రాతో పాటు 229, 153, 196 బెటాలియన్ల జవాన్లు పక్కా సమాచారంతో కర్రెగుట్టల్లోని తడపల అటవీ ప్రాంతానికి వెళ్లారు. కూంబింగ్​ చేస్తూ మావోయిస్టులు ఆయుధాలు తయారు చేసే కేంద్రాన్ని గుర్తించారు. 

51 బీజీఎల్​లు, 100 బండిళ్ల అల్యూమినియం వైరు, బీజీఎల్​లు తయారు చేసేందుకు వాడే 50 స్టీల్​ పైపులు, 20 ఐరన్​ షీట్లు, 40 ఐరన్​ ప్లేట్లు, 5 ఐఈడీ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు ప్లాన్​ చేశారని, దానిని నిర్వీర్యం చేశామని బీజాపూర్​ పోలీసులు ప్రకటించారు.

బీజేపీ కార్యకర్త హత్య..

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం బీజేపీ కార్యకర్తను హత్య చేశారు. జిల్లాలోని ఇల్​మిడి పోలీస్ స్టేషన్ సమీపంలోని ముంజాల్​ కాంకేర్​ గ్రామంలో సాయుధులైన మావోయిస్టులు ఉదయం 4 గంటల సమయంలో పూనెం సత్యం ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యుల ఎదుటే కత్తితో పీక కోసి చంపారు. అనంతరం అక్కడ ఒక లేఖను వదిలారు. పోలీస్​ ఇన్​ఫార్మర్​గా వ్యవహరిస్తున్నాడని, గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా దళాల ఆచూకీ పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపించారు.

ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం: ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో సీనియర్​ నేతలు దామోదర్, ఆజాద్​కు గార్డులుగా పని చేసిన లేఖం బండి అలియాస్​ శాంతి, మడవి కోసాతో పాటు పార్టీ మెంబర్​ కుంజం పాపారావు, మిలీషియా మెంబర్​ మడవి లక్మా, దొడ్డి భద్రు లొంగిపోయిన వారిలో ఉన్నారు. లొంగిపోయిన వారికి రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థికసాయం అందించామని తెలిపారు.