
- ప్రైవేట్ షాపుల్లో టాబ్లెట్లు,
- ఇంజక్షన్ల కొనుగోలు
- తాత్కాలికంగా మందులు సర్దుబాటు చేస్తున్న సిబ్బంది
సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ లో మెడిసిన్ కొరత ఏర్పడింది. మూడు నెలలుగా మందుల సరఫరా లేకపోవడంతో వెల్ నెస్ సెంటర్ కు వచ్చిన వారందరూ ప్రైవేట్ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ల్యాబ్ టెస్ట్ ల నిర్వహణ అంతంత మాత్రంగానే జరుగుతుండగా దీనికి తోడు మందుల కొరత వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీపీ, షుగర్ టాబ్లెట్ల సరఫరా నిలిచిపోవడంతో పక్క సెంటర్ల నుంచి తెప్పించి సిబ్బంది తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నారు. సిద్దిపేటతో పాటు సమీప జిల్లాలైన సిరిసిల్ల, జనగామ, కరీంనగర్ నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు ప్రతి రోజు వందల మంది సిద్దిపేట వెల్ నెస్ సెంటర్ కు వస్తుంటారు. సంపూర్ణ వైద్య సేవలు అందుతాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే వారికి అవసరమైన మందులు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
షుగర్, బీపీ టాబ్లెట్ల కొరత
సిద్దిపేట వెల్ నెస్ సెంటర్ లో దాదాపు 500 రకాల మందులను పంపిణీ చేస్తారు. వీటిలో ఎక్కువగా షుగర్, బీపీ ట్యాబెట్లు, ఇన్సులిన్ ఇంజక్షన్లు, మోకాళ్ల నొప్పుల మందులు, టానిక్, ఆయింట్మెంట్లు అవసరమైనంత మేర సరఫరా కావడం లేదు. వెల్ నెస్ సెంటర్ ను సందర్శించే వారికి నెల రోజులకు సరిపడా బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వాల్సి ఉన్నా మందుల కొరతతో చాలా మందికి ఇవ్వడం లేదు.
అందుబాటులో ఉన్న కొన్ని పరిమితమైన మందులను మాత్రమే పంపిణీ చేసి మిగితావి లేవని సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు ఇండెంట్ పెడితే అవసరమైన మందులు వెల్ నెస్ సెంటర్ కు సరఫరా చేస్తుంటారు. రెండు నెలల కింద ఇండెంట్ పెట్టినా ఇప్పటికీ మందులు సరఫరా కాక పోవడం గమనార్హం.
తాత్కాలిక సర్దుబాట్లు
వెల్ నెస్ సెంటర్ కువచ్చిన వారికి అవసరమైన మందులు లేకపోవడంతో సిబ్బంది తాత్కాలికంగా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమీప సెంటర్ల నుంచి కొద్ది మొత్తంలో మందులు తెప్పించి అవసరమైన వారికి పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీ హాబ్ లో సమస్య వల్ల కొద్ది రోజులుగా వెల్ నెస్ సెంటర్లో ల్యాబ్ టెస్ట్ కోసం షాంపిళ్లను సేకరించడం మానేశారు.
దీంతో అవసరమైన రక్త పరీక్షల కోసం వెల్ నెస్ సెంటర్ కు వచ్చే వాళ్లు ప్రైవేట్ ల్యాబ్ లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సిద్దిపేట వెల్ నెస్ సెంటర్ ను అధికారులు పర్యవేక్షించడం లేదు. మందుల కొరతతో పాటు సేవల విషయంలో సిబ్బంది వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అవసరమైన మందులు దొరుకుతలేవు
సిద్దిపేట వెల్ నెస్ సెంటర్లో అవసరమైన మందులు దొరుకుతలేవు. మోకాళ్ల నొప్పులు, బీపి, షుగర్ గోళీలను తీసుకోవడానికి వస్తే లేవని చెబుతున్నారు. కనీసం బలం టానిక్ లు ఇవ్వాలని కోరినా లేవంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మందులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ మెడికల్షాపులలో కొనుగోలు చేస్తున్నారు. - లక్ష్మి, ప్రజ్ఞాపూర్
వారం రోజుల్లో అన్ని రకాల మందులు
వారం రోజుల్లో సిద్దిపేట వెల్ నెస్ సెంటర్ కు అవసరమైన మందులు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఇండెంట్ పెట్టాం. తాత్కాలికంగా ఇతర సెంటర్ల నుంచి మందులు తెప్పించి సర్దుబాటు చేస్తున్నాం. మందుల షార్టేజ్ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. కొద్ది రోజుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ ప్రసాద్, వెల్ నెస్ సెంటర్ ఇన్చార్జి