
చెన్నూరు, వెలుగు: గోదావరి ఇసుకకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చెన్నూరులో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్టు మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డి, డీజీఎండీసీ పీవో శ్రీధర్ తెలిపారు. బుధవారం చెన్నూరుప్రెస్ క్లబ్లో వారు వివరాలు వెల్లడించారు. చెన్నూరుతో పాటు పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాల కోసం ఆస్నాద్రోడ్లోని వంద పడకల హాస్పిటల్ సమీపంలో సాండ్ బజార్ కోసం స్థలాన్ని గుర్తించామన్నారు. వారం రోజుల్లో సాండ్ బజార్ను ప్రారంభిస్తామని తెలిపారు.
కోటపల్లి మండలం ఎర్రాయిపేట గోదావరిలోని టీజీఎండీసీ క్వారీ నుంచి ఇసుకను సాండ్ బజార్కు తరలిస్తామని తెలిపారు. టన్ను ఇసుక రూ.500 లోపే లభిస్తుందని చెప్పారు. టీజీఎండీసీ పోర్టల్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాల నిఘా, టీజీఎండీసీ, మైనింగ్ సిబ్బంది పర్యవేక్షణలో సాండ్ సప్లై చేస్తామన్నారు. డిమాండ్ను బట్టి త్వరలోనే మిగతా మండలాల్లో సాండ్ బజార్ల ఏర్పాటుకు మంత్రి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.