తల్లిపాలతో జువెలరీ

తల్లిపాలతో జువెలరీ

ఈ కాలం అమ్మల్లో కొందరు అమ్మతనం జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అనుకుంటున్నారు. అలాంటివాళ్లకోసం తల్లిపాలతో చేసిన జువెలరీ అందిస్తున్నారు ఈ ఇద్దరు ఆర్టిస్టులు. ఇంతకు వీళ్లకి బ్రెస్ట్​మిల్క్​ జువెలరీ ఆలోచన ఎలా వచ్చిందంటే....   చెన్నైకి చెందిన ఆర్టిస్ట్​ ప్రీతి విజయ్​కి చిన్నప్పటి నుంచి ఆర్ట్, క్రాఫ్ట్ వర్క్​ అంటే ఇష్టం డిగ్రీ చదివిన​ తర్వాత పాలిమర్​, మట్టి కలిపి తయారుచేసిన బొమ్మలు అమ్మడం మొదలుపెట్టింది. తల్లిపాలతో చేసిన జువెలరీ కావాలని కొందరు తల్లులు ఆమెని అడిగేవాళ్లు. దాంతో అప్పటినుంచి ‘మొమ్మాస్​ మిల్కీ లవ్​’ పేరుతో రకరకాల డిజైన్లలో ఉన్న ఉంగురాలు, చెవి కమ్మలు, పెండెంట్స్​ అమ్ముతోంది ప్రీతి. డిజైన్​, మెటీరియల్​ని బట్టి వీటి ధర రూ.1000 నుంచి 4 వేల లోపు ఉంటుంది. 

ఇన్​స్టాగ్రామ్​లో చూసి....
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉంటున్న 25 ఏండ్ల సారా కాస్టిల్లో ఇన్​స్టాగ్రామ్​లో తల్లిపాలతో చేసిన నగల్ని  చూసింది. తనకి కూడా ‘బ్రెస్ట్​మిల్క్​ జువెలరీ బిజినెస్​’లోకి రావాలినిపించింది. అప్పటికే ఆమెకు ఏడాది వయసున్న పాప ఉంది. దాంతో మొదట్లో తన పాలతోనే ఎక్స్​పెరిమెంట్స్​ చేసేది.  ఈ ఏడాది మార్చిలో ‘కీప్​సేక్​స్​ బై గ్రేస్​’ అనే కంపెనీ పెట్టి, తల్లిపాలతో చేసిన ఉంగరాలు, పెండెంట్లు అమ్మడం మొదలుపెట్టింది సారా. డిజైన్​, సైజ్​ను బట్టి ఒక్కో పెండెంట్​ ధర 60 నుంచి 150 డాలర్లు. 

ఇవి చాలా స్పెషల్​
‘‘జువెలరీలు అంటే చాలామందికి సెంటిమెంట్. అయితే, తల్లిపాలతో చేసిన జువెలరీలు మాత్రం చాలా స్పెషల్​. ఎందుకంటే ఇవి మాతృత్వపు గుర్తులుగా నిలిచిపోతాయి. మా క్లయింట్లలో చాలామంది పిల్లలు పాలు తాగడం మానేసి, సాలిడ్ ఫుడ్​ తింటున్న టైమ్​లో తమ పాలని పంపిస్తారు. తమ ఆఖరి పాలబొట్టుని అందమైన జ్జాపకంగా మలచుకోవాలనే తపన ఉంటుంది వాళ్లకి” అని చెప్తోంది సారా. 
ఎలా చేస్తారంటే..తల్లిపాలని ఎండలో ఉంచి, వాటిని బాగా ఇగుర్చుతారు. దాంతో పాలు పిండిలా మారతాయి. ఆ   పిండిలో రెసిన్​ అనే జిగురు పదార్థాన్ని కలిపి, రాయిగా మారుస్తారు. తర్వాత కస్టమర్లు కోరిన డిజైన్​లో పెండెంట్, రింగ్స్​ తయారుచేసి అందిస్తారు.