
ఈ కాలం అమ్మల్లో కొందరు అమ్మతనం జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అనుకుంటున్నారు. అలాంటివాళ్లకోసం తల్లిపాలతో చేసిన జువెలరీ అందిస్తున్నారు ఈ ఇద్దరు ఆర్టిస్టులు. ఇంతకు వీళ్లకి బ్రెస్ట్మిల్క్ జువెలరీ ఆలోచన ఎలా వచ్చిందంటే.... చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ ప్రీతి విజయ్కి చిన్నప్పటి నుంచి ఆర్ట్, క్రాఫ్ట్ వర్క్ అంటే ఇష్టం డిగ్రీ చదివిన తర్వాత పాలిమర్, మట్టి కలిపి తయారుచేసిన బొమ్మలు అమ్మడం మొదలుపెట్టింది. తల్లిపాలతో చేసిన జువెలరీ కావాలని కొందరు తల్లులు ఆమెని అడిగేవాళ్లు. దాంతో అప్పటినుంచి ‘మొమ్మాస్ మిల్కీ లవ్’ పేరుతో రకరకాల డిజైన్లలో ఉన్న ఉంగురాలు, చెవి కమ్మలు, పెండెంట్స్ అమ్ముతోంది ప్రీతి. డిజైన్, మెటీరియల్ని బట్టి వీటి ధర రూ.1000 నుంచి 4 వేల లోపు ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్లో చూసి....
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉంటున్న 25 ఏండ్ల సారా కాస్టిల్లో ఇన్స్టాగ్రామ్లో తల్లిపాలతో చేసిన నగల్ని చూసింది. తనకి కూడా ‘బ్రెస్ట్మిల్క్ జువెలరీ బిజినెస్’లోకి రావాలినిపించింది. అప్పటికే ఆమెకు ఏడాది వయసున్న పాప ఉంది. దాంతో మొదట్లో తన పాలతోనే ఎక్స్పెరిమెంట్స్ చేసేది. ఈ ఏడాది మార్చిలో ‘కీప్సేక్స్ బై గ్రేస్’ అనే కంపెనీ పెట్టి, తల్లిపాలతో చేసిన ఉంగరాలు, పెండెంట్లు అమ్మడం మొదలుపెట్టింది సారా. డిజైన్, సైజ్ను బట్టి ఒక్కో పెండెంట్ ధర 60 నుంచి 150 డాలర్లు.
ఇవి చాలా స్పెషల్
‘‘జువెలరీలు అంటే చాలామందికి సెంటిమెంట్. అయితే, తల్లిపాలతో చేసిన జువెలరీలు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి మాతృత్వపు గుర్తులుగా నిలిచిపోతాయి. మా క్లయింట్లలో చాలామంది పిల్లలు పాలు తాగడం మానేసి, సాలిడ్ ఫుడ్ తింటున్న టైమ్లో తమ పాలని పంపిస్తారు. తమ ఆఖరి పాలబొట్టుని అందమైన జ్జాపకంగా మలచుకోవాలనే తపన ఉంటుంది వాళ్లకి” అని చెప్తోంది సారా.
ఎలా చేస్తారంటే..తల్లిపాలని ఎండలో ఉంచి, వాటిని బాగా ఇగుర్చుతారు. దాంతో పాలు పిండిలా మారతాయి. ఆ పిండిలో రెసిన్ అనే జిగురు పదార్థాన్ని కలిపి, రాయిగా మారుస్తారు. తర్వాత కస్టమర్లు కోరిన డిజైన్లో పెండెంట్, రింగ్స్ తయారుచేసి అందిస్తారు.