సంక్షేమ పథకాలు అందేదాక కొట్లాడుతా : రఘునందన్ రావు

సంక్షేమ పథకాలు అందేదాక కొట్లాడుతా : రఘునందన్ రావు
  • ఎంపీ రఘునందన్ రావు

 శివ్వంపేట, వెలుగు: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతానని ఎంపీ రఘునందన్​రావు​అన్నారు. శనివారం మండలంలోని పెద్ద గొట్టిముక్కల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రెడ్యాతండా, భోజ్య తండా, శభాష్ పల్లి,  దొంతి గ్రామాల నుంచి పెద్ద గొట్టిముక్కుల బీఆర్ఎస్ నాయకుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పదేళ్ల పాటు సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వారే ఉన్నా పెద్ద గొట్టిముక్కల గ్రామానికి  బస్సు సౌకర్యం ఏర్పాటు చేయక పోవడం దారుణమన్నారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీ కింద సీసీ రోడ్లు, స్ట్రీట్​ లైట్లు, టాయిలెట్స్​ మంజూరు చేస్తోందని, రేషన్ బియ్యం ఇస్తుందని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. కొందరు మహిళలు తమకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని ఎంపీ దృష్టికి తీసుకురాగా మూడు రోజులలో బియ్యం ఇవ్వకుంటే నేను వచ్చి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 

స్కూలు కాంపౌండ్ కు రూ.10 లక్షలు, గ్రామంలో  రెండు సోలార్ లైట్లు మంజూరు చేస్తున్నట్టు ఎంపీ వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రవి, నాయకులు సురేశ్, కొండలరావు, అశోక్, ఆంజనేయులు, వినోద్, అంజి గౌడ్, భిక్షపతి, శ్రీనివాస్, నర్సింలు గౌడ్ పాల్గొన్నారు.