ముంబైలోని చెంబూర్ (Chembur) వాషి నాకా ప్రాంతంలో ఓ వింత జరిగింది. ఆదివారం నవంబర్ 23న కాళీమాత గుడికి వచ్చిన భక్తులు గుడిలోని కాళీమాత విగ్రహానికి మేరీమాత (Mother Mary) లాంటి బట్టలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ అసాధారణ విషయం అక్కడ గొడవకు దారితీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సమాచారం ప్రకారం, కాళీమాత విగ్రహం రూపాన్ని చూసి భక్తులు వెంటనే గుడి పూజారిని అడిగ్గా.. అప్పుడు పూజారి... "కలలో అమ్మవారు కనిపించి, నన్ను మేరీమాతలాగా అలంకరించమని చెప్పింది అని సమాధానం ఇచ్చారు. పూజారి చెప్పిన సమాధానం భక్తులకి, స్థానిక మత పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. దీనిని సమాజంలో గొడవలు పెట్టే చర్యగా భావించి, తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.
దీనికి సంబంధించి గుడి పూజారిని స్థానిక సంఘాలు RCF పోలీస్ స్టేషన్కు అప్పగించాయి. అయితే, కొంతమంది స్థానికులు మాత్రం, ఎవరో డబ్బులు ఇచ్చి పూజారితో ఇలా చేయించి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఇలా చేసినందుకు పూజారిపై సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు. కోర్టులో అతనికి రెండు రోజుల పోలీసు కస్టడీ విధించగా.... ఈ పని వెనుక వేరే వ్యక్తుల ప్రమేయం లేదా ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
