హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి హైదరాబాద్కు గంజాయి సప్లయ్ చేస్తున్న ఇద్దరిని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సోమవారం అరెస్ట్ చేసింది. రూ.15 లక్షల విలువ చేసే1.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ అమిత్ ఘవేట్ తెలిపిన వివరాల ప్రకారం.. యూఎస్ఏ నుంచి హై గ్రేడ్(బడ్) గంజాయి సప్లయ్ జరుగుతున్నట్లు ఎన్సీబీకి సమాచారం అందింది. షిప్పింగ్, ఎయిర్ కార్గో కొరియర్స్ ద్వారా హైదరాబాద్కు సప్లయ్ అవుతున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో హైదరాబాద్ యూనిట్ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు.హైదరాబాద్ బేగంపేట్లోని ఓ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్లో సోదాలు చేశారు. ఎయిర్టైట్ కవర్స్తో పరుపుల మధ్య ప్యాక్ చేసిన గంజాయిని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వివిధ దేశాల నుంచి హై గ్రేడ్ గంజాయి, డ్రగ్స్ను ఇండియాకు ఇంపోర్ట్ చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో పార్సిల్ వచ్చిన యూఎస్ఏ అడ్రస్, డెలివరీ వివరాలు ట్రాక్ చేస్తున్నారు. డార్క్నెట్ ద్వారా హై గ్రేడ్ గంజాయి ఆర్డర్స్ చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. విదేశాల్లో సాగుచేసే హైగ్రేడ్ గంజాయికి హైదరాబాద్, బెంగళూర్లో డిమాండ్ ఉన్నట్లు తెలిసింది. నిరుడు బెంగళూర్లో కిలో హై గ్రేడ్ గంజాయిని సీజ్ చేసి, గ్రీస్ నుంచి వచ్చిన పార్సిల్లో సప్లయ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.