బెంగళూరు: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ యాజమాన్యం యుఎస్లోని హెడ్జ్ ఫండ్ ద్వారా రూ.4,419 కోట్లు (533 మిలియన్ డాలర్లు) అక్రమంగా సంపాదించిందని ఇన్వెస్టర్లు ఆరోపించారు. ఇటీవల మొదలుపెట్టిన 200 మిలియన్ డాలర్ల విలువైన రైట్స్ఇష్యూను నిలిపివేసేలా ఆదేశించాలని బెంగళూరులోని ఎన్సీఎల్టీని కోరారు. ఇన్వెస్టర్ల ఆరోపణలపై మూడు రోజుల్లోగా రాతపూర్వకంగా స్పందించాలని కంపెనీ లా కోర్ట్ బైజూస్ను ఆదేశించింది.
అప్పటి వరకు తన ఆర్డర్ను రిజర్వ్ చేసింది. రైట్స్ఇష్యూ బుధవారం ముగుస్తుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు -బెంచ్ ముందు నలుగురు వాటాదారులు చేసిన ఆరోపణలపై బైజూస్ స్పందించలేదు. ఇప్పటి వరకు స్టే రాలేదు కాబట్టి రైట్స్ఇష్యూ కొనసాగుతుందని సంస్థకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పెట్టుబడిదారులు కంపెనీకి అడ్డంకులు సృష్టిస్తున్నారని కంపెనీ వాదించింది. అయితే బైజూస్ నుంచి నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.