డ్రగ్స్​ నిర్మూలనపై విస్తృత ప్రచారం చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

డ్రగ్స్​ నిర్మూలనపై విస్తృత ప్రచారం చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాలకు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. డ్రగ్స్, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణ, అట్రాసిటీ చట్టం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన ‘ప్రగతిరథం -ప్రజా చైతన్యం’ ప్రచార రథయాత్ర వాహనాన్ని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్​జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్ నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

మాదకద్రవ్యాల రహిత జిల్లా స్థాపన కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో.. నెల రోజుల పాటు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, వయో వృద్ధుల హక్కులు, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక నిషేధం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఇ.విష్ణువర్ధన్, కళాకారులు సుదర్శన్, నాగరాజు, రఘునాథ్, లక్ష్మణ్, సుదర్శన్, మాధవి  పాల్గొన్నారు.