
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
బాల్కొండ, వెలుగు : దేశంలో అవినీతి రహిత సమాజ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప సభ కు ఆయన హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. దేశంలో 17 కోట్ల ఇండ్లకు నల్లా నీరు, 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 10 కోట్ల 33 లక్షల గ్యాస్ సిలిండర్లు, ప్రతి గ్రామంలో 22.6 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్నామన్నారు. 40 శాతం భారతీయులకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, 50 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఐదు సిటీల్లో ఉన్న మెట్రోను ఇప్పుడు 23 పట్టణాలకు విస్తరింపచేశామన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు కోట్లకు పైగా పేదలకు ఇండ్లు నిర్మించామని వెల్లడించారు. ముద్ర యోజన కింద 52 కోట్ల ప్రజలకు రుణాలు అందించారని అన్నారు. రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున నేషనల్ హైవేలు చేపడుతున్నామన్నారు. డిఫెన్స్, టెక్నాలజీ, వ్యవసాయం, మహిళల ఆత్మగౌరవం, శాటిలైట్ రంగాల్లో దేశం అతివేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్ జోలికి వచ్చేందుకు ప్రపంచ దేశాలు వణుకుతున్నాయన్నారు. ఆదివారం జరిగే అమిత్ షా సభను విజయవంతం చేయాలని, మొదట పసుపు బోర్డు ప్రకటన చేసింది అమిత్ షానే అని ఆయన గుర్తు చేశారు.
అందుకు రైతులు వేలాదిగా తరలిరావాలని కోరారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ముప్కాల్ మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ ముస్కు భూమేశ్వర్, బాల్కొండ మాజీ ఎంపీపీ లింగా గౌడ్, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ వెంకట్ రాజ్, ముప్కాల్ మాజీ ఉపసర్పంచ్ సువర్ణ లింగం, రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్ సుంకం శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఎంపీ అరవింద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి, నియోజకవర్గ ఇన్చార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ మండల ప్రెసిడెంట్ అంబటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.