మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్ని బ్యాన్ చేసినట్లుగా తెలిపింది. 2023 నవంబర్ 1 నుంచి -30 మధ్య 71,96,000 ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా వెల్లడించింది. ఇందులో దాదాపు 19,54,000 ఖాతాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపింది. భారత ఐటీ నిబంధనలను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లుగా వాట్సాప్ వెల్లడించింది. భారతీయ ఖాతాలుగా చెలామణీ అవుతూ.. +91 కోడ్లేని ఖాతాలపై కూడా నిషేధం విధించినట్లు తెలిపింది.
భారత్ లో 500 మిలియన్లకు పైగా యూజర్స్ ను కలిగి ఉన్న వాట్సాప్.. యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రత కల్పిస్తుంది. ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సోషల్ మీడియా సంస్థ నెలవారీ రిపోర్ట్ను పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను పొందుపరాచాల్సి ఉంటుంది.