బరిలో ఎవరిని దింపుదాం.. జీపీల వారీగా సమావేశమవుతున్న లీడర్లు

బరిలో ఎవరిని దింపుదాం.. జీపీల వారీగా సమావేశమవుతున్న లీడర్లు
  • గెలుపు గుర్రాలను సూచించాలని కేడర్​కు పార్టీల ఆదేశాలు
  • రెబల్స్​ ఉండొద్దని సూచనలుజనరల్​ స్థానాల్లోనూ     బీసీలు పోటీ చేసే అవకాశం
  • నేటి నుంచి ఫేజ్​-1 సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు నామినేషన్లు

మహబూబ్​నగర్, వెలుగు: సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. పార్టీ గుర్తుల మీద కాకుండా.. క్యాండిడేట్లకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తుల మీద పోటీ జరగనుండటంతో ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని కాంగ్రెస్.. అధికార పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలను దక్కించుకొని, గ్రామస్థాయి నుంచి పార్టీలను బలోపేతం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి.

కేడర్​తో చర్చించాకే క్యాండిడేట్​పై నిర్ణయం

కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​లు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అత్యధిక స్థానాలు గెలిస్తే వచ్చే జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్, కార్పొరేషన్​ఎన్నికల్లో పట్టు సాధించొచ్చని భావిస్తున్నాయి. దీంతో ప్రతీ గ్రామంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటున్నాయి. అయితే నామినేషన్​దాఖలుకు మూడు రోజులే టైమ్ ఉండటంతో బుధవారం ఉదయం నుంచి అధికార కాంగ్రెస్​కు చెందిన నియోజకవర్గ స్థాయి లీడర్లు  మండల, గ్రామ స్థాయి నాయకులను పిలిపించుకుంటున్నారు. ఎన్నికల బరిలో ఎవరిని దింపుదాం? అక్కడ ఎంతమంది పోటీకి సిద్ధమవుతున్నారు? వారికి ప్రజల్లో బలం ఉందా? ఆర్థిక పరిస్థితి ఏంటి? ఓ లీడర్​కు పార్టీ తరఫున మద్దతు ఇస్తే.. మరో వ్యక్తి రెబల్​గా నామినేషన్​వేస్తాడా? తదితర విషయాలు తెలుసుకుంటున్నారు.

 గెలుపు గుర్రాలను సూచించాలని కోరుతున్నారు. కొన్ని స్థానాల్లో ఏడెనిమిది మంది పోటీ పడుతుండటంతో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇద్దరు లీడర్ల చొప్పున క్యాండిడేట్ల లిస్ట్​ను మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు తెలిసింది. గురువారం మరోసారి చర్చించి ఇద్దరిలో ఒకరిని ఫైనల్​చేయనున్నట్లు సమాచారం. ఇద్దరు లీడర్లు రాజీకి రాకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలే అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం రెండు రోజులుగా కేడర్​తో సమావేశం అవుతున్నాయి. కొన్ని జీపీలకు క్యాండిడేట్లను ఫైనల్​ చేసినట్లు సమాచారం.  

జనరల్​ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం

పంచాయతీ ఎన్నికలకు రొటేషన్​ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంతో పోలిస్తే బీసీలకు స్థానాలు తగ్గాయి. నారాయణపేట జిల్లాలో నిరుడు బీసీలకు 84 స్థానాలు రిజర్వ్​ కాగా.. 72 స్థానాలు కేటాయించారు. మహబూబ్​నగర్​జిల్లాలో గతంలో 97 స్థానాలు కేటాయించగా.. ఈసారి 86 రిజర్వ్​అయ్యాయి. నాగర్​కర్నూల్​జిల్లాలో నిరుడు 83 జీపీలు రిజర్వ్​ కాగా.. ఈసారి 61 స్థానాలు అలాట్ అయ్యాయి. 

గద్వాలలో నిరుడు 80 స్థానాలు, ఈసారి 70 స్థానాలు కేటాయించారు. వనపర్తి జిల్లాలో గతంలో 62 స్థానాలు కేటాయించగా.. ఈసారి కూడా అవే రిజర్వ్ అయ్యాయి. అయితే స్థానాలు తగ్గిపోవడంతో మిగతా అన్ రిజర్వ్​డ్​ఉమెన్, అన్​రిజర్వ్​డ్​స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. దీనికితోడు కాంగ్రెస్​ ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పడంతో దాదాపు అన్​రిజర్వ్​డ్, అన్ రిజర్వ్​డ్​ఉమెన్​ స్థానాల్లో 30 శాతానికి పైగా బీసీలు పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మొదటి విడత పంచాయతీ, వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. అయితే నామినేషన్ల స్వీకరణ కోసం 4 గ్రామ పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్​గా ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ లోనే ఆయా జీపీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న క్యాండిడేట్లు నామినేషన్​వేయాల్సి ఉంటుంది. 

ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు

జిల్లా    పురుషులు    మహిళలు    ఇతరులు    మొత్తం

మహబూబ్​నగర్    2,48,222    2,51,349    11    4,99,582

నాగర్​కర్నూల్​    3,23,015    3,24,316    11    6,47,342

నారాయణపేట    1,94,124    2,02,410    07    3,96,541

వనపర్తి    1,90,068    1,92,223    04    3,82,295

గద్వాల    1,93,627    1,99,781    10    3,93,418