హైదరాబాద్,వెలుగు: పోలీస్ డిపార్ట్మెంట్లో అవినితీ, సెటిల్ మెంట్లకు పాల్పడిన పోలీసులు అధికారులు, సిబ్బంది సస్పెండ్, అటాచ్మెంట్స్, మెమో, చార్జిమెమోలను లైట్ తీసుకుంటున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మళ్లీ అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, లైంగిక వేధింపులు, సివిల్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది 32 మంది పోలీసులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు. ఇందులో 12 మందిని సస్పెండ్ చేయగా మరో 20 మందిని అటాచ్మెంట్స్,మెమోలు ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత విచారణ జరిపించి క్రమశిక్షణా చర్యల కింద హెడ్ క్వార్టర్ట్స్ కు అటాచ్ చేశారు. జనాలతో కాంటాక్ట్స్ ఉండని విధుల్లో నియమించారు. మారేడ్పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులోనూ సస్పెన్షన్తో సరిపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సస్పెన్షన్లోనూ సగం జీతం
తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారిపై పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. పోలీసులపై వచ్చే కంప్లయింట్లపై ప్రాథమిక ఆధారాలు ఉంటే సాధారణంగా 3 నెలల నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తుంటారు. సస్పెండ్ అయిన వారికి మొదటి 6 నెలల పాటు సగం జీతం వస్తుంది. ఆ తర్వాత 75 శాతం జీతం అందిస్తారు. సంబంధిత అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లేదా పోలీస్ స్టేషన్లలో అటెండెన్స్ తప్పనిసరి చేస్తారు. దీంతో పాటు బాధ్యులైన పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజామా లేదా అనే వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం ఓవర్ ఆల్ ఎంక్వయిరీ(ఓఈ) పేరుతో స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తారు. కోర్టు ట్రయల్ కేసుల తరహాలోనే ఓఈ బాధితులు,సాక్షుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. కోర్టు కేసులను పరిగణలోకి తీసుకుని డిపార్ట్మెంట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి కేసుల్లో సుమారు 95 శాతం మంది అధికారులకు క్లీన్ చిట్ వచ్చేలా రిపోర్ట్స్ ఉంటాయి.
విచారణను మేనేజ్ చేసుకుంటూ..
ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) సిబ్బంది, ఎంక్వయిరీ ఆఫీసర్స్ సొంత డిపార్ట్మెంట్ వారే కావడంతో అక్రమాలకు పాల్పడే అధికారులు సస్పెన్షన్ను లెక్కచేయడం లేదు. ఎలాంటి కేసులోనైనా సరే తప్పించుకోవచ్చులే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమపై వచ్చే ఆరోపణలు, కంప్లయింట్లను అనుకూలంగా మార్చుకుంటూ.. సస్పెన్షన్లపై క్లీన్ చిట్ తెచ్చుకుంటామనే ధీమాతో ఉంటున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడే కేసుల్లో మినహా మిగతా అన్ని కేసుల్లో తమకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చే విధంగా కొందరు అవినీతి పోలీసులు ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బాధితులను, ఫిర్యాదుదారులతో సెటిల్మెంట్ చేసుకుని సస్పెన్షన్ ఎత్తి వేయించుకుంటున్నట్లు ఉన్నతాధికారులు
గుర్తించారు.
మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్ఐ, కానిస్టేబుల్ డిస్మిస్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పీఎస్లో గతేడాది జూన్ 18న జరిగిన మరియమ్మ లాకప్డెత్ కేసులో ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును సీపీ మహేశ్ భగవత్ సీరియస్ గా తీసుకున్నారు. లాకప్ డెత్ నిజమని తేలడంతో ఆర్టికల్ 311(2),బీ25(2) ప్రకారం బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ ఒక్క కేసులో తప్ప ఇతర కేసుల్లో ఏ ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించిన దాఖలాలు లేవు. ఆరోపణలు వచ్చిన వారిపై సస్పెన్షన్ వేటు మాత్రమే వేసి లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓవర్ ఆల్ ఎంక్వయిరీ ఆఫీసర్ ఇచ్చే రిపోర్ట్నే ఫైనల్ చేస్తున్నారు.