రేషన్ సంబురం.. మూడు నెలల తర్వాత నేటి నుంచి మళ్లీ పంపిణీ

 రేషన్ సంబురం..  మూడు నెలల తర్వాత నేటి నుంచి మళ్లీ పంపిణీ
  • ఉమ్మడి జిల్లాలో 12 లక్షలకు చేరిన కార్డులు
  • 23,030 మెట్రిక్​ టన్నుల బియ్యం కేటాయింపు
  • కొత్త లబ్ధిదారుల్లో ఆనందం

జనగామ, వెలుగు : మూడు నెలల తర్వాత నేటి నుంచి మళ్లీ రేషన్​ పంపిణీ షురూ కానుంది. జూన్​, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి జూన్​లో పంపిణీ చేశారు. ఏండ్లుగా ఎదురు చూసిన రేషన్​ కార్డుల జారీని ప్రస్తుత సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో  కార్డుల సంఖ్య 12 లక్షలకు చేరింది.  ఉమ్మడి జిల్లాలో  2,305 రేషన్​ దుకాణాలుండగా అన్నింటి పరిధిలో కొత్తగా లక్షకు పైగా 
కార్డులు వచ్చి చేరాయి. 

23,030 టన్నుల బియ్యం కేటాయింపు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని జనగామ, హన్మకొండ, వరంగల్​, మహబూబాబాద్​, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో రేషన్​ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈ జిల్లాల్లో గత మే నెల వరకు 11,12,620 రేషన్​ కార్డులు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 12,16,008కి చేరాయి.  కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. లబ్ధిదారుల సంఖ్య 36,17,604కు పెరిగింది.  వీరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు. ఇందుకోసం 23,030 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని సర్కారు అలాట్​ చేయగా రేషన్ దుకాణాలకు చేరింది.

జనగామ జిల్లాలో 335 రేషన్​ షాపులుండగా 3,470 మెట్రిక్​ టన్నుల బియ్యం అలాట్​ అయ్యాయి. హన్మకొండ జిల్లాలో 413 దుకాణాలుండగా 4676 టన్నులు, వరంగల్​ జిల్లాలో 500 దుకాణాలుండగా 5382 టన్నులు, మహబూబాబాద్​ జిల్లాలో 558 దుకాణాలుండగా 5127 టన్నులు, భూపాలపల్లిలో 277 దుకాణాలుండగా 2495 టన్నులు, ములుగు జిల్లాలోని 222 రేషన్​ దుకాణాలుండగా 1880 టన్నుల బియ్యం అలాట్​ కాగా పంపిణీ చేయనున్నారు. దీంతో కొత్తగా రేషన్​ తీసుకోనున్న లబ్ధిదారులు 
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఆనందంగా ఉంది : మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం బీక్యానాయక్​ తండా పంచాయతీ పరిధిలోని దంతెలగడ్డ తండ. పెండ్లై నాలుగేండ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సర్కారు టైంలో కొత్త రేషన్​ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఎన్నిసార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదు. కాంగ్రెస్​ సర్కారు రాగానే మళ్లీ దరఖాస్తు చేస్తే రేషన్​ కార్డు వచ్చింది. ఈ నెల నుంచి సన్నబియ్యం కూడా ఇస్తామంటున్నరు. చాలా ఆనందంగా ఉంది.- బానోత్​ అనిత, కొత్త రేషన్​ కార్డు లబ్ధిదారురాలు

పదేండ్లు ఎదురు చూసిన :మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్.  నాకు పెళ్లయి 16 సంవత్సరాలు అవుతోంది. 14,  7 యేండ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులున్నరు.  పదేండ్ల నుంచి రేషన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న. అప్పటి సర్కారు పట్టించుకోలేదు. మా కుటుంబ సభ్యులు నలుగురి పేరుతో రేషన్​ కార్డు మంజూరైంది.   -  ఎలికట్టె సురేశ్ గౌడ్​, లబ్ధిదారుడు​