- వాటర్ సప్లై అభివృద్ధికి రూ.220 కోట్లు కేటాయింపు
- నగరంలో కొత్తగా 15 తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి చర్యలు
- 60 డివిజన్ల పరిధిలో సీవర్ లైన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు
మహబూబ్నగర్, వెలుగు:పాలమూరు కార్పొరేషన్కు భారీగా నిధులు మంజూరయ్యాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.883 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్కు (యూడీఎస్), రూ.220 కోట్లు వాటర్ సప్లై అభివృద్ధికి ఖర్చు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద రూ.220 కోట్లలో రూ.60.1 కోట్లు, రూ.603 కోట్లలో రూ.172.68 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్కు సంబంధించిన పనులకు టెండర్లు పూర్తి కాగా.. యూడీఎస్కు సంబంధించి త్వరలో టెండర్లు పిలువనున్నారు.
తాగునీటి పైపులైన్ మాదిరిగా సీవర్ లైన్
మహబూబ్నగర్ నగరంలోని పెద్ద చెరువుకు గతంలో నాలాల ద్వారా పెద్ద మొత్తంలో మురుగు నీరు వచ్చి చేరేది. దీంతో చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం కంపు వాసన వచ్చేది. అయితే కొద్ది రోజులుగా ఈ మురుగు చెరువులోకి రాకుండా నీటిని బైపాస్ చేస్తున్నారు. ఈ బైపాస్ చేసిన నీటిని శుద్ధి చేయడానికి రెండేళ్ల కిందట అమృత్ స్కీమ్ కింద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరైంది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కు సీవర్ లైన్ ద్వారా మురుగు నీటిని తరలించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం నగరంలో ఓపెన్ డ్రైనేజీల ద్వారా నీరు వస్తోంది. ఈక్రమంలో ప్రస్తుతం మంజూరైన రూ.603 కోట్లతో సీవర్ లైన్ ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకుగాను నగరాన్ని నాలుగు జోన్లుగా డివైడ్ చేశారు. ఇందులో మూడు జోన్లు నగరంలో, మరో జోన్ నగరం బయట ఉంటుంది. ఎర్రకుంట, గోల్ మసీద్ ప్రాంతాన్ని ఒక జోన్గా, పెద్ద చెరువు ప్రాంతాన్ని మరో జోన్గా, శ్రీనివాస కాలనీ ఏరియాను ఇంకో జోన్గా, మయూరి పార్క్, కొత్త కలెక్టరేట్ ప్రాంతాన్ని ఇంకొక జోన్గా డివైడ్ చేశారు. ఇందులో మయూరి పార్క్, కొత్త కలెక్టరేట్ జోన్ నగరం బయట ఉంటాయి. మిగతా మూడు జోన్లు నగరం లోపల ఉంటాయి. ఈ నాలుగు జోన్ల పరిధిలోని 60 డివిజన్లలో సీవర్ లైన్ను ఏర్పాటు చేయనున్నారు.
210 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్..
రానున్న 15 ఏండ్ల వరకు నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు యూఐడీఎఫ్ ద్వారా రూ.220 కోట్లను కేటాయించారు. 3 లక్షల జనాభాకు సరిపడా నీటిని అందించేందుకు ఈ నిధులతో తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చనున్నారు. ప్రస్తుతం నగరంలో 28 తాగునీటి ట్యాంకులు ఉండగా.. వీటి సామర్థ్యం 2.85 కోట్ల లీటర్లు. అయితే అదనంగా 1.50 కోట్ల లీటర్ల కెపాసిటీ ఉన్న 15 కొత్త ట్యాంకులను నిర్మించనున్నారు.
ఈ ట్యాంకులను వీరన్నపేట డబుల్ బెడ్రూమ్ కాలనీ, హనుమాన్పుర, పాత డీఎంహెచ్వో ఆఫీస్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఏరియా, రామయ్యబౌలి, తిరుమల హిల్స్, మర్లు బైపాస్, ఏనుగొండ, టీచర్స్ కాలనీ, మెట్టుగడ్డ, జైనల్లీపూర్ వద్ద నిర్మించనున్నారు. మరో మూడు ట్యాంకులను ఎక్కడ నిర్మించాలనే దానిపై సర్వే చేస్తున్నారు. ఈ 15 ట్యాంకులకు నీటిని అందించడానికి 26 కిలోమీటర్ల మేర ఫీడర్ మెయిన్ పైప్లైన్ను వేయనున్నారు. అలాగే 210 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ వేయనున్నారు. ఈ లైన్ ద్వారా కొత్తగా పది వేల కనెక్షన్లు ఇవ్వనున్నారు.
రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ నగరాన్ని అన్నిరంగాల్లో మొదటి స్థానంలో ఉంచడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని డెవలప్ చేసేందుకు రూ.603 కోట్లతో చేపట్టే భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకింగ్ రూ.430.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 172.68 కోట్లు ఈ ప్రాజెక్టు కింద మంజూరైనట్లు తెలిపారు.
త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవు తుందన్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తానని తెలిపారు. తాను రూ.వెయ్యి కోట్ల నిధులు మహబూబ్నగర్ అభివృద్ధికి తెచ్చానని, గతంలో ఈ స్థాయిలో ప్రాజెక్టులు తెచ్చినట్లు నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఎన్పీ వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, సీజే బెనహర్ పాల్గొన్నారు.
