- జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ఫైర్
నిజామాబాద్, వెలుగు: దొరల దురహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా వీడడం లేదని ఉమ్మడి నిజామాబాద్ఇన్చార్జ్ మంత్రి ధనసరి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, అర్ధనగ్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా పోలీసులతో ప్రవర్తించిన తీరును యావత్ సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని కమ్మర్పల్లి మండలం నాగాపూర్, మోర్తాడ్ మండలంలోని పాలెంలో నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగులను ప్రారంభించారు.
పాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. దళిత స్పీకర్ పట్ల వాడిన భాషను నిరసిస్తూ దళిత సమాజం కేసీఆర్ ఫామ్హౌస్ వద్దకు వెళ్తే ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లు చల్లి దొరతనాన్ని నిరూపించుకున్నారని విమర్శించారు. దళితులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో పడేయగా సీఎం రేవంత్రెడ్డి ఇంటి పెద్దకొడుకుగా ఒక్కొక్కదాన్ని సరిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చేందుకు కంకణం కట్టుకొని సర్కార్ పనిచేస్తోందని తెలిపారు. ఒంటరి, వితంతులకు త్వరలో పింఛన్లు ఇవ్వనుట్లు చెప్పారు. ఆ తర్వాత మిగితా అర్హులకు చేయూతనిస్తామన్నారు. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ సెంటర్లు, రోడ్ల అభివృద్ధికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు.
