గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో సూపర్బజార్లను మూసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కార్మికులకు క్రెడిట్పై క్వాలిటీ నిత్యావసర సరుకులు, ఇతర హోంనీడ్స్ అందించేవారు. అయితే కొన్ని రోజులుగా సూపర్ బజార్లలో 60 శాతం నుంచి 70 శాతం వరకు సరుకులను అందుబాటులో పెట్టడం లేదు. ఇప్పటికే వివిధ కాలనీల్లో నెలకొల్పిన 30 వరకు మినీ సూపర్ బజార్లను మేనేజ్మెంట్ మూసివేయగా, తాజాగా ఏరియా వైజ్ సూపర్ బజార్లను కూడా మూసివేసే స్థితికి తెస్తున్నారు.
1974లో కార్మికుల కోసం సూపర్ బజార్లు
సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్ల కోసం కో ఆపరేటివ్ సొసైటీ కింద 1974లో అప్పటి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బీఎన్ రామన్ ఏరియాల వారీగా సూపర్ బజార్లు ఏర్పాటు చేశారు. బియ్యం, పప్పులు, నూనె, మిగతా అన్ని రకాల నిత్యావసర సరుకులు, బట్టలు ఇందులో అందుబాటులో ఉంచారు. నెలకు రూ.10 వేల క్రిడెట్పై సరుకులు అందించగా, ఈ మొత్తాన్ని నెక్ట్స్ మంత్ పొందే జీతంలో నుంచి కట్ చేసేవారు. ఆ తర్వాత టీవీలు, వాషింగ్ మెషిన్లు, కూలర్లు, ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏరియా వైజ్ సూపర్ బజార్లలో కొనుగోళ్ల తాకిడి ఎక్కువగా ఉండడంతో కార్మికుల కాలనీల వారీగా కూడా మినీ సూపర్ బజార్లు స్టార్ట్ చేశారు. అయితే ఐదేండ్ల కాలంలో 11 ఏరియాల్లోని వివిధ కార్మిక కాలనీలలో 30 వరకు మినీ సూపర్ బజార్లను మేనేజ్మెంట్ మూసివేసింది.
ఎందుకిలా?
ఇటీవల మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సూపర్ బజార్లో విక్రయించిన సరుకులకు సంబంధించిన డబ్బులు సరుకులు కొనుగోలు చేసిన సంస్థలకు అక్కడి సిబ్బంది అప్పగించలేదు. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన బిల్లులు కూడా సక్రమంగా కంపెనీ ఖాతాలో జమచేయలేదు. ఆడిట్లో పెద్ద మొత్తంలో క్యాష్ తేడా కనిపించడంతో దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. దీంతో పాటు చిన్నచిన్న కంపెనీల వద్ద సరుకులు కొనుగోలు చేయగా ఆయా కంపెనీలు జీఎస్టీ చెల్లించకపోవడంతో గవర్నమెంట్ సింగరేణికి నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.35 లక్షల వరకు సింగరేణి సంస్థ జీఎస్టీ రూపంలో చెల్లించింది. ఈ పరిణామాలన్నీ మిగతా ఏరియాల్లో ఉన్న సూపర్ బజార్లపై ప్రభావం చూపుతున్నాయి. 15 వరకు చిన్నచిన్న కంపెనీల వద్ద సరుకులు కొనుగోలు చేయడాన్ని మేనేజ్మెంట్ బంద్ పెట్టింది. హైదరాబాద్లోని పేరున్న కంపెనీ వద్దనే సింగరేణి సంస్థ సామగ్రి కొంటున్నది. అయితే ఆ కంపెనీ వద్ద ఏయే వస్తువులు ఉంటే అవే తీసుకురావడంతో సింగరేణి సూపర్ బజార్లలో బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టాలు ఏర్పడి సూపర్ బజార్లను మూసివేసే పరిస్థితి ఏర్పడనుంది.
అన్ని రకాల సరుకులు తేవాలి..
సింగరేణి కార్మికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సూపర్ బజార్లలో అన్ని రకాల సరుకులు, వస్తువులు అందుబాటులోకి తేవాలి. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతో ఏర్పాటు చేసిన సూపర్ బజార్లను మూసివేసేందుకు కొందరు ఆఫీసర్లు ప్రయత్నం చేస్తున్నారు. కుట్రలు మానుకోకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడ్తాం.
- మడ్డి ఎల్లాగౌడ్, డైరెక్టర్, సూపర్ బజార్స్