హైదరాబాద్, వెలుగు: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కంపెనీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి 'సైబర్ ఎడ్జ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. రాబోయే మూడు సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో తమ సైబర్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణ సైబర్ దాడులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే టాప్–2లో ఉన్నాయి.
2024లో ఈ రెండు రాష్ట్రాల్లో 62 లక్షలకుపైగా మాల్వేర్ దాడులు, 17,500 ర్యాన్సమ్వేర్ దాడులు జరిగాయి. డేటా బ్రీచ్ సగటు నష్టం రూ. 19.5 కోట్లు ఉంది. ఫార్మా, ఐటీ, బీఎఫ్ఎస్ఐ, తయారీ రంగాల కంపెనీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ ఎడ్జ్ ద్వారా నష్టాలను భర్తీ చేయడమే కాకుండా, సంస్థలు సైబర్ రిజైలెన్స్ను పెంచుకోవడానికి సహాయపడతామని టాటా ఏఐజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నజ్మ్ బిల్గ్రామీ అన్నారు.
ప్లాన్ ఫోరెన్సిక్ దర్యాప్తులు, డేటా రికవరీ, చట్టపరమైన మద్దతు సహా ఇతర నష్టాలను కవర్ చేస్తుందని తెలిపారు.
