
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నెల రోజులుగా పోడు భూములు సాగు చేయకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. మొక్కలు నాటేందుకు ట్రెంచ్ లు కొట్టేందుకు యత్నిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ల తీరుకు నిరసనగా రైతులు, మహిళలు గురువారం నుంచి పోడు భూముల సమీపంలో టెంట్ వేసి దీక్షకు దిగారు.
పోడు భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లెయిన్లతో వచ్చి ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దశాబ్దాలుగాసాగు చేసుకుంటున్న పోడు భూములను విడిచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. పోడు రైతుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం రైతులు కమిటీగా ఏర్పడి అధికారులతో చర్చించాలని కోరారు. అక్కడికి వచ్చిన ఎఫ్ఆర్వో ఇక్బాల్ హుస్సేన్ కు సైతం సమస్య వివరించారు. రైతుల భూములు లాక్కొని, అందులో బలవంతంగా మొక్కలు నాటడం సరైంది కాదన్నారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.