
దుబాయ్: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వైస్-కెప్టెన్, డ్యాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆరేండ్ల విరామం తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ర్యాంకును తిరిగి కైవసం చేసుకుంది. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్ట్ను వెనక్కునెట్టి తను టాప్లోకి వచ్చింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో 27, 28 స్కోర్లు మాత్రమే చేసిన లారా 19 రేటింగ్ పాయింట్లను కోల్పోయి ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం మంధాన 727 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ సివర్-బ్రంట్ (719) రెండో ప్లేస్లో నిలిచింది. వోల్వర్ట్ కూడా 719 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 2019 తర్వాత స్మృతి మళ్లీ నం.1 ప్లేస్ అందుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల కొలంబోలో శ్రీలంక, సౌతాఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో సెంచరీ చేయడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది. ఇండియా బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వరుసగా 14, 15వ ర్యాంక్ల్లో ఉన్నారు. కాగా, ఈ నెల చివర్లో ఇండియా విమెన్స్ టీమ్.. ఇంగ్లండ్ టూర్కు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ టీమ్తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల్లో తలపడనుంది.