ఎయిర్​ ఇండియా కొనుగోలుపై టాటా అగ్రిమెంట్

ఎయిర్​ ఇండియా కొనుగోలుపై టాటా అగ్రిమెంట్
  • డిసెంబర్ నాటికి డీల్ పూర్తవచ్చు

న్యూఢిల్లీ: ఎయిర్​ ఇండియాను అమ్మేందుకు టాటా సన్స్​తో కేంద్ర ప్రభుత్వం సోమవారం షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ (ఎస్​పీఏ) కుదుర్చుకుంది. ఎయిర్​ ఇండియాను రూ. 18 వేల కోట్లకు కొనడానికి టాటా సన్స్​ బిడ్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్​ ఇండియాను కొనే రేసులో టాటా గ్రూపే హయ్యస్ట్​ బిడ్​ దాఖలు చేసింది. టాటా సన్స్​తో షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​పై సంతకాలు చేసినట్లు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ ఎసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్) సెక్రటరీ తుహిన్​ కాంత పాండే ట్విటర్​లో వెల్లడించారు. ఎయిర్​ ఇండియాతో పాటు ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​నూ టాటా గ్రూప్​ చేజిక్కించుకుంది.

ఎయిర్​ ఇండియా ప్రైవేటు చేతికి వెళ్తే మళ్లీ గ్రోత్​ బాట పడుతుందని సివిల్​ ఏవియేషన్​ సెక్రటరీ రాజీవ్​ బన్సల్​ ఇంతకు ముందే చెప్పారు. ప్రొఫెషనల్​గా నడపడం వల్లే ఆ గ్రోత్​ సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద విమానాలను మంచిగా వాడుకోవడంతోపాటు, విమానాలలో కల్పించే సేవలను మెరుగుపరిస్తే ఎయిర్​ ఇండియాకు తిరుగు ఉండదని బన్సల్​ చెప్పారు. వాడకం సరిగా ఉంటే విమానాల ఫ్లయింగ్​ హవర్స్​ కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే నెలల్లో మరో కొత్త ఎయిర్​లైన్​ రావడంతోపాటు, జెట్ ఎయిర్​వేస్​ కూడా మళ్లీ కార్యకలాపాలు మొదలు పెట్టనుంది. ఎక్కువ మంది పోటీదారులు మార్కెట్లో ఉండటం వల్ల ఏవియేషన్​ సెక్టార్​కు మేలే జరుగుతుందని, కన్జూమర్లకూ బెనిఫిట్​ ఉంటుందని రాజీవ్​ బన్సల్​ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది ప్లేయర్లు ఉండటం వల్ల మార్కెట్లో మోనోపోలీకి ఛాన్స్​ ఉండదన్నారు.

టాటా గ్రూప్​లోని టాలేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఎయిర్​ ఇండియా కోసం బిడ్​ను వేసింది. ఎయిర్​ ఇండియా చేజిక్కుంచుకోవడానికి రూ. 2,700 కోట్ల క్యాష్​ను చెల్లించడానికి, రూ. 15,300 కోట్ల ఎయిర్​ ఇండియా అప్పులను తీసుకోవడానికీ ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఆ తర్వాత అక్టోబర్​ 11న గవర్నమెంట్​ ఈ కంపెనీకి లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ (ఎల్​ఓఐ) జారీ చేసింది. ఎయిర్​ ఇండియాలో 100 శాతం వాటాను ప్రభుత్వం అమ్మేస్తోంది. స్పైస్​జెట్​ ప్రమోటర్​ అజయ్​ సింగ్​ కూడా ఎయిర్​ ఇండియా కోసం టాటాలతో పోటీ పడ్డారు. కానీ, ఆయన బిడ్​ రూ. 15,100 కోట్లే. దాంతో టాటాలకే ఎయిర్​ ఇండియా  దక్కింది. టాటా గ్రూప్​తో ఎయిర్​ ఇండియా డీల్​ డిసెంబర్​ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్​కు ఇప్పటికే రెండు ఎయిర్​లైన్స్​ కంపెనీలలో పెట్టుబడులున్నాయి. ఎయిర్​ ఇండియాతో కలిపితే ఆ గ్రూప్​ చేతిలో మూడు ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఉంటాయి. ఎయిర్​ ఇండియాకు 43 వైడ్​ బాడీ ప్లేన్​లు ఉండగా, అందులో 27 బోయింగ్​ 787 విమానాలే ఉన్నాయి. ఎయిర్​ ఇండియా చేతిలో మొత్తం 141 విమానాలుండగా, అందులో 42 లీజుకి తీసుకున్నవి. టాటాలు తీసుకోగా మిగిలిన ఎయిర్​ ఇండియా అప్పులు రూ. 46,262 కోట్లను ఎయిర్​ ఇండయా ఎసెట్​ హోల్డింగ్​ లిమిటెడ్​ (ఏఐఏహెచ్ఎల్​) తీసుకుంటుంది. ఎయిర్​ ఇండియా నిర్వహణ బాధ్యతల నుంచి వీలయినంత త్వరగా తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే దాని నిర్వహణ కోసం  రోజుకి రూ. 20 కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది.