ఆసీస్తో జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి మాంచి ఊపుమీదున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగే డిసైడర్ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. అయితే చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది.
పాక్ రికార్డు బద్దలయ్యే ఛాన్స్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా, ఇండియా చెరో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆదివారం వేదికగా జరగనున్న మ్యాచ్ సిరీస్ డిసైడర్గా మారింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే టీ20ల్లోనే కొత్త చరిత్రను లిఖించనుంది. ఒక క్యాలండర్ ఈయర్లో అత్యధిక విజయాలందుకున్న తొలి జట్టుగా రోహిత్ సేన రికార్డులకెక్కనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ రికార్డును అధిగమించనుంది.
పాక్ను అధిగమించేనా..?
టీమిండియా 2022లో ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో 20 విజయాలు సాధించింది. ఇక బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ 2021లో 20 విజయాలు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే తాజాగా నాగ్పూర్ విజయంతో భారత్ ఈ రికార్డును సమం చేసింది. ఆదివారం మ్యాచ్లో రోహిత్ సేన గెలిస్తే 21 విజయాలతో చరిత్ర సృష్టించనుంది.