
- రాష్ట్ర సర్కార్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో వరదల ముప్పు పొంచి ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకున్నదీ నివేదించాలంది. విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 39 కింద విపత్తుల సమయంలో తీసుకునే చర్యల గురించి 2023 సెప్టెంబర్ 4న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సూచించింది.
ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ల డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. వరదలకు దాదాపు 60 మంది మరణించిన ఘటనలు చోటు చేసుకున్నందున చట్టం అమలుకు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలంటూ డాక్టర్ చెరుకూరి సుధాకర్, కె.శ్రవణ్ కుమార్ సంయుక్తంగా 2022లో పిల్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.