ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట .. జిల్లా రివ్యూ మీటింగ్ లో మంత్రులు కొండా సురేఖ

ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట .. జిల్లా రివ్యూ మీటింగ్ లో మంత్రులు కొండా సురేఖ

సంగారెడ్డి, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్టు జిల్లా ఇన్ చార్జి  మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దేశంలోనే తెలంగాణ వ్యవసాయంలో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలపై సంగారెడ్డి కలెక్టరేట్ లో మూడు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో మంత్రులు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా  ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి ఇతర సంక్షేమ పథకాల గురించి మంత్రులు జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారీగా అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయా కలెక్టర్లు మంత్రులకు వివరించారు. సమావేశంలో ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు క్రాంతి వల్లూరు, రాహుల్ రాజ్, మనుచౌదరి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్  కార్పొరేషన్ చైర్మన్ ఫాహిం పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో 95 శాతం ధాన్యం సేకరణ

దేశంలోనే ధాన్యం పండించడంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో ధాన్యం పండించడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు వెళ్లి నేరుగా రైతులను కలుస్తున్నారన్నారు. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

 గత ప్రభుత్వం ధరణితో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు. ఎరువుల, విత్తనాల కొరత లేదని, రైతులకు పూర్తి స్థాయిలో స్టాక్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 95 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. మంత్రి దామోదర మాట్లాడుతూ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొంటామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భూభారతిపై అవగాహన కల్పించండి

భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొన్ని ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని వెంటనే నివారించి తగు చర్యలు తీసుకోవాలని మూడు జిల్లాల కలెక్టర్లకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అడిషనల్​కలెక్టర్లు, జిల్లా అధికారులు,ఆర్డీవోలు పాల్గొన్నారు.