- తెలంగాణ గౌట్ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ గౌట్ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం బాగ్లింగంపల్లిలో పెన్షనర్ల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలిండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి.సుధాకర్, జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మార్చి 25న పెన్షనర్లకు నష్టం కలిగించేలా చట్టాలు తీసుకువచ్చిందని, ఆ తేదీని దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తామని తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల పెన్షనర్లతో కలిసి 10 రోజులపాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పరిధిలోని పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
