Telangana Tour : మన వరంగల్ లోని ఈ గడీలో.. వందల సినిమాలు తీశారు.. చూసి రండి చాలా బాగుంటుంది..!

Telangana Tour : మన వరంగల్ లోని ఈ గడీలో.. వందల సినిమాలు తీశారు.. చూసి రండి చాలా బాగుంటుంది..!

గతంలో సామాన్య ప్రజలు గడీల దగ్గరకు వెళ్లాలంటే భయపడేవాళ్లు. 70 ఏళ్ల క్రితం వరకు గడీల నుంచే దొరల పాలన సాగేది. పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఈ గడీల్లోనే తీసుకునేవాళ్లు. తర్వాత దొరల పాలన అంతరించి పోవడంతో గడీలు పాత గోడలుగా మారాయి. కానీ.. అక్కడక్కడ కొన్ని గడీలు మాత్రం నిజాం పాలనకు అవశేషాలుగా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో కల్లెడ గడీ ఒకటి.  ఈ గడీలో అనేక సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి. 

వరంగల్​ రూరల్​ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన ఎర్రబెల్లి వీరరాఘవరావు అనే దొరకు తొమ్మిది మంది సంతానం. అందులో ఏడుగురు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు మొదటి కొడుకు వెంకటేశ్వర్​ రావు. 1936లో ఆయనే ఈ గడీని కట్టించాడు. సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గడీ చుట్టు పక్కల పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రెండంతస్తుల్లో ఉన్న ఈ గడీలో 76 గదులు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సినిమా షూటింగ్​ లకు వాడుతున్నారు. 

షూటింగ్ స్పాట్ 

గడీల అప్పుడప్పుడు సినిమాలు, షార్ట్​ ఫిల్మ్స్, సీరియళ్ల షూటింగ్ లు జరుగుతుంటాయి. నాని ''ఎంసీఏ', రవితేజ 'నీ కోసం", ఆర్ నారాయణ మూర్తి 'వీరతెలంగాణ', శ్రీహరి 'హస్యంతు', 'చాకలి అయిలమ్మ'.. ఇలా చాలా సినిమాల షూటింగ్ జరిగింది ఇక్కడ. ఈ గడీని ఇప్పటి వరకు చాలామంది ప్రముఖులు, ముఖ్యమంత్రులు సందర్శించారు. దీన్ని చూసేందుకు విదేశాల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. 

Also Read : అపార్ట్ మెంట్ లో రెండో బాత్రూం ఎక్కడ ఉండాలి

గోడలపై సంస్కృతం 

మామూలుగా గడీల గోడలపై ఆకట్టుకునే చిత్రాలు కనిపిస్తుంటాయి. కానీ, ఈ గడీ గోడలపై సంస్కృతంలో రాసిన వాక్యాలు కనిపిస్తున్నాయి. గడీ వైభవం అందరికీ తెలియాలని గోడలపై గడి గురించి సంస్కృతంలో రాయించారని ఎర్రబెల్లి వంశీయలు చెప్పారు. ఇప్పుడు ఈ వంశీయులంతా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.. 

వారసత్వ సంపదగా గుర్తింపు

కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లెడ గడీని రాష్ట్ర వారసత్వ సంపదగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో కల్లెడ పర్యాటక ప్రాంతంగా మారుతోంది. గడీని భావితరాలకు భద్రంగా అందించడంతో పాటు గత వైభవాన్ని తెలియచేసే అవకాశం లభించిందని ఎర్రబెల్లి వంశీయులు, గ్రామస్తులు అంటున్నారు. 
 

చాలా సంతోషం.. 

మా గ్రామంలోని గడీని ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లోని ఇలాంటి గడీలు శిథిలావస్థకు చేరాయి. ఇంకొన్ని అయితే ఆనవాళ్లే లేకుండా పోయాయి. ఎర్రబెల్లి దొరలు మాత్రం ఈ గడీని కాపాడుకుంటూ వస్తున్నారు.