హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీజీ ఐసెట్–2026’ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉన్నత విద్యామండలిలో చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఐసెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 6న ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్ ఫీజు లేకుండా మార్చి16 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, మిగతా వారికి రూ.750 అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు. మే13, 14 తేదీల్లో రెండు సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు ఉంటాయని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు. సమావేశంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి ఎడ్ సెట్ దరఖాస్తులు..
రెండేళ్ల బీఈడీ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించే ‘టీజీ ఎడ్ సెట్–2026’ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న రిలీజ్ కానున్నది. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఎడ్ సెట్ కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్18 వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. మే 12న ఎడ్ సెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం10 నుంచి 12 వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామ్ రెడ్డి వెల్లడించారు.
