
న్యూఢిల్లీ: పాకిస్తాన్, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఆక్రమణదారుల చెరలో ఉన్న ఇలాంటి ఆస్తులను విడిపించేందుకు కూడా సర్కారు కసరత్తును మొదలుపెట్టింది. ఈ ఆస్తులను లీగల్భాషలో శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్) అంటారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 12,611 ఎనిమీ ప్రాపర్టీస్ ఉండగా,వాటి మొత్తం విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ద్వారా ఏర్పాటైన కస్టోడియన్ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ఇండియా(సెపీ) సంస్థ పరిధిలోకి ఈ ఆస్తులన్నీ వస్తాయి. ఎనిమీ ప్రాపర్టీస్ ను కబ్జాల నుంచి విడిపించడానికి, విక్రయించడానికి సంబంధించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ తాజాగా పలు మార్పులు చేసింది. వీటి ప్రకారం..జిల్లా మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ సహకారంతో ఈ ఆస్తులను కబ్జాదారుల గుప్పిట్లో నుంచి విడిపిస్తారు. ఈక్రమంలో రూ.కోటిలోపు విలువ చేసే ఎనిమీ ప్రాపర్టీ ఒకవేళ ఎవరి కబ్జాలోనైనా ఉంటే.. ఆ కబ్జా చేసిన వ్యక్తికే కొనుగోలు చేసే తొలి చాన్స్ ఇస్తారు. ఒకవేళ అతడు కొనుగోలుకు నిరాకరిస్తే, దాన్ని కేంద్రం చట్టప్రకారం అధీనంలోకి తీసుకొని ఇతరులకు విక్రయిస్తుంది. రూ.కోటి నుంచి రూ.100 కోట్లలోపు విలువ కలిగిన ఎనిమీ ప్రాపర్టీస్ను మెటల్ స్క్రాప్ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన ఈ–ఆక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా ‘సెపీ’ సంస్థ వేలం వేస్తుంది. దీనికి సంబంధించిన రేటును ఎనిమీ ప్రాపర్టీ డిస్పోజల్ కమిటీ డిసైడ్ చేస్తుంది.