రోడ్లు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం : బండి సంజయ్

రోడ్లు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం : బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కొత్తపల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​అన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.31.12 కోట్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్​లో రూ.14 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం ఆయన ప్రారంభించారు. ఆసిఫ్ నగర్(బావుపేట)లో రూ.9.50 లక్షలతో నిర్మించనున్న మార్కెట్ షెడ్డు పనులకు భూమిపూజ చేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.74 లక్షలు విడుదల చేశామన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్, సిద్దిపేట, ఎల్కతుర్తి నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలో కరీంనగర్-–జగిత్యాల రోడ్డు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. రాజీవ్​రహదారి విస్తరణకు కేంద్రం సిద్ధంగా ఉందని, రోడ్​మెయింటెనెన్స్​కాంట్రాక్ట్​సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకొని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి, మాజీ అధ్యక్షుడు కడార్ల రతన్​కుమార్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి అంజనీకుమార్, నాయకులు జవ్వాజి రమేశ్​, కట్ల శ్రీనివాస్, కడారి శ్రీనివాస్, సోమినేని కరుణాకర్, మల్లేశం, ఇల్లందుల ఆనంద్, బైరెడ్డి వంశీ, బోనాల నరేశ్ పాల్గొన్నారు.  

‘హగ్స్ అండ్ హార్ట్స్’ స్కూల్ ప్రారంభం

కరీంనగర్ టౌన్, వెలుగు: మానేరు విద్యాసంస్థల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాబోధన అందిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తీగలగుట్టపల్లిలో మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను శనివారం సుడా చైర్మన్ నరేందర్  రెడ్డి, విద్యాసంస్థల  చైర్మన్ కడారి అనంతరెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్, నాయకులు కసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేశ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య తదితరులు పాల్గొన్నారు.