లక్నో: పంజాబ్లో కొత్త జిల్లాగా మలేర్ కోట్లాను ఏర్పాటు చేస్తున్నట్లు అమరీందర్సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరప్రదేశ్సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ విభజన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది..’ అని అన్నారు. ‘విశ్వాసం, మతం ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే.. పంజాబ్లో మలేర్ కోట్లాను జిల్లాగా ఏర్పాటు చేయడం కాంగ్రెస్ విభజన విధానానికి ఓ నిదర్శనం..’ అంటూ శనివారం యోగి ట్వీట్చేశారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న మలేర్ కోట్లాను23వ జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం రంజాన్ సందర్భంగా సీఎం అమరీందర్సింగ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై యూపీ సీఎం విమర్శిస్తూ చేసిన ట్వీట్పై అమరీందర్ సింగ్ ఘాటుగానే స్పందించారు. పంజాబ్ వ్యవహారాలకు యోగి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కౌంటర్ఇచ్చారు. ‘గత నాలుగేళ్లుగా యూపీలో మత విభేదాలను పోత్సహిస్తూ అనుసరిస్తున్న విభజన, విధ్వంసక బీజేపీ ప్రభుత్వ విధానాలేవి పంజాబ్లో లేవు. పంజాబ్ నీతి గురించి, మలేర్కోట్లా చరిత్ర గురించి ఆయనకు (యోగి ఆదిత్యనాథ్) ఏం తెలుసు? భారత రాజ్యాంగాన్ని ఆయనెలా అర్థం చేసుకున్నారో కానీ.. యూపీలో తన సొంత ప్రభుత్వమే నిత్యం దాన్ని ఉల్లంఘిస్తోంది’ అని అమరీందర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు.
