
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో శుక్రవారం జరిగిన 68వ రైల్ వీక్ కార్యక్రమంలో భాగంగా ‘అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్–2023’ ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. 2022 ఏడాదికిగానూ దేశవ్యాప్తంగా రైల్వేలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, ఉద్యోగులు 100 మంది అవార్డులు అందుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు మొత్తం 7 అవార్డులు దక్కాయి.కాజీపేట డిప్యూటీ చీఫ్ ఇంజినీరింగ్ డీఎస్ రామారావు, విజయవాడకు చెందిన సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సీహెచ్ దినేశ్ రెడ్డి
సికింద్రాబాద్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ మల్లెల శ్రీకాంత్, డివిజనల్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ శివకుమార్ కశ్యప్, నిజామాబాద్ ఆర్పీఎఫ్ ఎస్సై ప్రత్యూష, సికింద్రాబాద్ చీఫ్టికెట్ ఇన్ స్పెక్టర్ నటరాజన్, బీదర్ ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్–1 ఇంజినీర్ వీవీ రంగయ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. ఇక రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఇంజినీరింగ్, కన్ స్ట్రక్షన్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు అవార్డు అందుకున్నారు.