
నీళ్లు పొదుపుగా వాడాలి.. ఈ మాట ఎప్పుడూ వినేదే. కానీ, ఎంత జాగ్రత్త చేసినా కొన్నిసార్లు అవసరానికి మించి నీళ్లు వాడి, వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదెలా అంటారా! హ్యాండ్ వాష్కి ఒక గ్లాస్ లేదా అరగ్లాస్ నీళ్లు సరిపోతాయి. కానీ అదే హ్యాండ్ వాష్కోసం ట్యాప్ తిప్పితే అరలీటరు నీళ్లు ఖర్చు అవుతాయి. ట్యాప్ ఫ్లో తక్కువ పెట్టినా నీటి వృథా కంట్రోల్ కొంచెమే అవుతుంది. నీటి సమస్యలు రోజురోజుకి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఈ సమస్యకి పరిష్కారంగా మార్కెట్లోకి కొత్తరకం నాజిల్స్ వచ్చాయి. నీటి వృథాని తగ్గించడానికి చెన్నైకి చెందిన ‘ఎర్త్ ఫోకస్’ అనే స్టార్టప్ కంపెనీ వీటిని తయారుచేసింది.ప్యాండమిక్ వల్ల నష్టపోయిన స్టార్టప్స్లో ఎర్త్ ఫోకస్ కూడా ఒకటి. అయినా వాళ్లు చేసే ఎక్స్పరిమెంట్స్ను ఆపలేదు ఈ స్టార్టప్ సీఈవో అరుణ్ సుబ్రమణియన్. నీటి వృథాని కంట్రోల్ చేయడానికి లాక్డౌన్లో ‘ఎకో–మిస్ట్ అంబరిల్లా, క్వా మిస్ట్360’ అనే రెండు నాజిల్స్ తయారుచేశాడు. అయితే ఇవేమీ కొత్త కాదు. లాక్డౌన్కి ముందే వీటిని మార్కెట్లోకి తెచ్చారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. కాకపోతే, లాక్డౌన్లో బిజినెస్ తగ్గడంతో వాటినే అప్డేట్ చేసి కొత్త వెర్షన్తో మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటిని వాడితే హ్యాండ్ వాష్, సామాన్లు, కూరగాయలు కడగడానికి ఉపయోగించే నీళ్లలో 95 శాతం వృథాను తగ్గిస్తాయి. కిచెన్, వాష్రూం ట్యాప్లకి వీటిని పెట్టేయొచ్చు. ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయిన ఎకో మిస్ట్ అంబరిల్లా నాజిల్స్ ఇప్పటి వరకు 8వేలు అమ్ముడుపోయాయి. క్వా మిస్ట్360 కి కూడా మంచి ఆదరణ వచ్చింది. వీటి రేటు కూడా ఆరువందలలోపే. ఈ నాజిల్స్ని మల్టీనేషనల్ కంపెనీలు వాడుతున్నాయి. కొన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఇవి ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి వీటిని పరిచయం చేసే ఆలోచనలో ఉందట ఈ స్టార్టప్. అదే జరిగితే నీటి వృథాని కొంతలో కొంతైనా కంట్రోల్ చేయొచ్చు.