అమ్మో కిలేడీ.. ఇది నీ పనా !

 అమ్మో కిలేడీ.. ఇది నీ పనా !
  • జల్సాల కోసం యువతి చోరీలు 
  • డబ్బులతో గోవా, ముంబైల్లో చిల్​
  • ఇప్పటివరకు మూడు దొంగతనాలు 
  • తాజాగా ఆల్విన్​కాలనీలో 22 తులాల బంగారం చోరీ 
  •  కేసు మిస్టరీ ఛేదించిన బాలానగర్ ​పోలీసులు 

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పరిధిలో ఈ నెల18న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ దొంగతనం ఓ యువతి చేసిందని తెలుసుకుని అవాక్కయ్యారు. వివరాలను బాలానగర్​ డీసీపీ సురేశ్​కుమార్​శుక్రవారం వెల్లడించారు. ఆల్విన్​కాలనీకి చెందిన వి.చిరంజీవి ప్రైవేట్​జాబ్​ చేస్తుంటాడు. ఈ నెల18న తన పిల్లలను స్కూల్​లో డ్రాప్​చేయడానికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి తాళం చెవిని చెప్పుల స్టాండ్​లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. గంట సేపటికి వచ్చి చూడగా, తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లగా 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి మాయం కావడంతో జగద్గిరిగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశాడు. 

సీసీ కెమెరాలో బయటపడ్డ గుట్టు  

ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఓ యువతి దొంగతనం చేసిందని గుర్తించారు. యూపీకి చెందిన బేబి అలియాస్​ఆరోహి(21) బతుకుదెరువు కోసం వచ్చి సనత్​నగర్​లోని మధునగర్​లో ఉంటోంది. ఇంటింటికీ తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటుంది. ఈమెకు లగ్జరీ లైఫ్​అంటే ఇష్టం. గోవా, ముంబైతో పాటు దేశంలోని మేజర్​సిటీస్​కు వెళ్లి లైఫ్​ను నచ్చినట్టు ఎంజాయ్​చేయాలనే ఆశ. ఈమె చేస్తున్న పనితో ఎక్కువ డబ్బులు రాకపోవడంతో లైఫ్​ను తాను అనుకున్నట్టు మల్చుకోవడానికి దొంగతనాలు ఒక్కటే మార్గమని డిసైడ్​అయ్యింది.  

సైకాలజీ కనిపెట్టింది..

చాలా మంది ఇండ్లకు తాళం వేసి వెళ్లేవారు తాళం చెవులను ఎక్కువగా షూ ర్యాక్స్, పూలకుండీలు, బకెట్స్, తలుపులపైన పెడతారని తెలుసుకుంది. కొన్ని నెలల కింద బోరబండ పోలీస్​స్టేషన్​లో ఇలాగే రెండు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్​పై బయటకు వచ్చింది. డబ్బులన్నీ అయిపోవడంతో మళ్లీ ఈనెల 18న ఆల్విన్​కాలనీకి వెళ్లింది. అక్కడ చిరంజీవి ఇంటికి తాళం వేసి ఉండడంతో టార్గెట్​చేసింది. ముందు ఇంటి ముందున్న  షూ​ర్యాక్​వెతికింది. 

అనుకున్నట్టే తాళం చెవి కనపబడడంతో దర్జాగా తాళం తీసి ఇంట్లోకి వెళ్లింది. తర్వాత బీరువాను బ్రేక్​చేసి అందులోని బంగారం, వెండి అంతా ఊడ్చుకెళ్లింది. పోలీసులు  సీసీ కెమెరాలు పరిశీలించగా ఆరోహి సంగతి బయటపడింది. ఆమెను అరెస్ట్​ చేసి 22.3తులాల బంగారం, 5 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్​కి తరలించారు. కేసును చాకచక్యంగా చేధించిన జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ నరేందర్​రెడ్డి, సీసీఎస్​ సీఐ రవి, ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు.