- బాచుపల్లిలో రూ.200 కోట్ల ల్యాండ్ కొట్టేసేందుకు ప్లాన్
- తప్పుడు పత్రాలు సృష్టించిన పెద్దలు
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలో 10 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని పట్టాగా మార్చుకునేందుకు కొందరు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఎకరా రూ.20 కోట్లు పలుకుతున్నది. అందులో భాగంగానే దీన్ని కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ సీలింగ్ ల్యాండ్స్పై ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు కంప్లైంట్స్ ఇచ్చారు. ప్రభుత్వ సీలింగ్ భూమిని వ్యక్తిగత పట్టాగా మార్చొద్దని.. వందల కోట్ల విలువ చేసే భూమిని కాపాడాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను కోరారు. బాచుపల్లి గ్రామంలోని 484, 485, 486 సర్వే నంబర్లలో సీలింగ్ ల్యాండ్ను 1975లో నోటిఫై చేశారు. అయితే, ఎలాగైనే ఈ ల్యాండ్ను తమ పేరు మీద చేసుకోవాలని నిర్ణయించుకున్న కొందరు పెద్దలు.. సీలింగ్ ప్రొసీడింగ్ రాకముందు ఒక డాక్యుమెంట్ను క్రియేట్ చేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఇలా తప్పుడు పత్రాలతో పాత తేదీల్లో డాక్యుమెంట్లు తయారు చేసి రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఇన్వాల్వ్ కాకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నట్లు తెలిసింది.

