
- ఓ కారు, పది సెల్ఫోన్లు స్వాధీనం
ఖానాపూర్, వెలుగు : అలుగును వేటాడి, స్మగ్లింగ్ చేస్తున్న పది మందిని ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో డివిజన్ ఆఫీసర్ భవానీ శంకర్ వెల్లడించారు. కొందరు వ్యక్తులు నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పంగిడి అటవీ ప్రాంతంలో అలుగును వేటాడారని ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 19న స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద గంగాప్రసాద్, షేక్ అహ్మద్, ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అలుగును వేటాడిన విషయాన్ని ఒప్పుకున్నారు. వారు ఇచ్చి సమాచారంతో ఈ కేసుతో సంబంధం ఉన్న గణేశ్, బారకేరావు, నగేశ్, విజయ్, శ్రీరాం, నాగోరావ్, రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు.
అలుగును పట్టుకున్న తర్వాత దానిని బర్కత్పుర కాలనీలోని ఓ వ్యక్తి ఇంట్లో దాచి పెట్టారు. అలుగును వేటాడిన వ్యక్తులను ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నట్లు తెలియడంతో సదరు వ్యక్తి అలుగును ఓ మురుగు కాల్వ వద్ద విడిచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది శనివారం అలుగును పట్టుకొని ఫారెస్ట్ ఆఫీస్కు తరలించారు. అలుగు చర్మానికి మార్కెట్లో మంచి ధర ఉందని పుకార్లు రావడంతో నమ్మిన వీరు అలుగును వేటాడారని డివిజనల్ ఆఫీసర్ భవానీ శంకర్ తెలిపారు. నిందితుల నుంచి ఓ కారు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఖానాపూర్ ఫారెస్ట్ రేజ్ ఆఫీసర్ కిరణ్కుమార్, సిబ్బంది మహేశ్, రవీందర్, నరేందర్, మోహెద్ పాల్గొన్నారు.