సైదాబాద్‌లో దారుణం.. పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

సైదాబాద్‌లో దారుణం.. పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

హైదరాబాద్: సైదాబాద్ లో పట్టపగలు దారుణం జరిగింది. పది సంవత్సరాల గిరిజన బాలిక అనుమాస్పద స్థితిలో చనిపోయింది. కొంత ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. దుండగులు బాలిక ను కొట్టి గాయపరచి హతమార్చినట్లు గుర్తులు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ చెబుతున్నారు. అభం శుభం తెలియని తమ కుమార్తెపై అఘాయిత్యానికి యత్నించి చంపేశారని కంటతడిపెట్టుకుంటూ విలపించారు. తమ చిన్నారిని దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఉన్నతాధికారులను  వేడుకుంటున్నారు. వారి కథనం మేరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజాబాగ్  లో నివాసముండే సేవ్యా నాయక్, జ్యోతి దంపతులకు ముగ్గురు సంతానం. ఈ నెల 23వ తేదీ నాడు రోజువారి మాదిరిగానే కూలి పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం వచ్చే సరికి గుడిసెలో తమ పదేళ్ల  కూతురు నగ్నంగా చనిపోయి పడి ఉందని చెబుతున్నారు. బాలిక శరీరం మెడ మొహంపై చిన్న చిన్న దెబ్బలు గోర్లతో గీరిన గాట్లు కనిపించాయని అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు  చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, పోస్ట్ మార్టం జరిపించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ... నా కూతురు ఆత్మహత్య చేసుకునే అవగాహన లేదని ఎవరో ఉద్దేశ్య పూర్వకంగా హతమార్చారని ఆరోపిస్తోంది. తమ కూతురు మృతి పట్ల  తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.