కీవ్: మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాకు ఉక్రెయిన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 24 గంటల్లో 1,000 మంది రష్యన్ రిజర్విస్టులను హతమార్చినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి సర్గీ షోయిగు బుధవారం ప్రకటించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి 71,200 మంది రష్యా సైనికులను చంపేసినట్టు తెలిపారు. ఆయుధాల్లేకుండా ఉక్రెయిన్ వైపు కదులుతున్న దళాలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు వివరించారు. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణ చేపట్టారని, మొత్తం 41,000 మంది రిజర్విస్టులు ఈ వార్లో పాల్గొంటున్నారని వివరించారు. వీరి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలిపారు. అమాయకులైన ప్రజలను యుద్ధంలో బలి చేస్తున్నారని పుతిన్ పై విమర్శలు గుప్పించారు. వార్ మొదలైన తర్వాత రష్యా తొలిసారి భారీగా సైనికులు నష్టపోయిందన్నారు. అదేవిధంగా, కీవ్లో ధ్వంసమైన వాటర్, పవర్ సప్లైను పునరుద్ధరించినట్టు వివరించారు. అయితే ఈ విషయంపై రష్యా స్పందించలేదు.
ఎక్స్పోర్టు డీల్ పునరుద్ధరణ
ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలతో బయలుదేరే నౌకల సెక్యూరిటీకి సంబంధించి గతంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిత్వంతో ఈ డీల్కు రష్యా సమ్మతించింది. అయితే, ఇటీవల క్రిమియాలోని రష్యా నావల్ బేస్ పై డ్రోన్ దాడి జరగడంతో ఈ డీల్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. అయితే, ఎక్స్పోర్ట్ డీల్ను సస్పెండ్ చేయడంపై యూఎన్తో పాటు అమెరికా కూడా రష్యాను తప్పుబడుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇబ్బంది పడతాయని గుర్తుచేశాయి. పేద దేశాల్లో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశాయి. తాజాగా ఈ విషయంపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ డీల్ ను పునరుద్దరిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.