- తంటాలు పడి ప్రైవేటు వెహికల్స్లో తరలిస్తున్న కుటుంబీకులు
- అవీ దొరకని చోట బైక్పై తీసుకెళ్తున్న బంధువులు
- టైమ్కు హాస్పిటల్ పోతమో లేదోనని మరికొందరిలో టెన్షన్
- రోడ్డుపైనే ప్రసవిస్తున్న కొందరు గర్భిణులు
రాష్ట్రంలో సరైన టైమ్కు అంబులెన్స్లు రాకపోవడం.. లాక్డౌన్తో రవాణా సౌకర్యం లేకపోవడంతో గర్భిణులు అవస్థలు పడుతున్నారు. 108 అంబులెన్స్లను కరోనా కేసులకే వాడుతుండటం, అమ్మఒడి (102) వెహికల్స్ సరిపడా లేకపోవడంతో సతమతం అవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది నానా తంటాలు పడి ప్రైవేటు వెహికల్స్లో గర్భిణులను దగ్గర్లోని హాస్పిటల్స్కు తరలిస్తున్నారు. అవీ అందుబాటులో లేని వాళ్లు బైక్పైనే హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు.
హైదరాబాద్, వెలుగు : వీళ్లిద్దరే కాదు.. లాక్డౌన్ టైమ్లో రాష్ట్రంలో చాలా మంది గర్భిణులు ఇలాంటి అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 23 నుంచి మే 31 వరకు 1.10 లక్షల మంది గర్భిణులు డెలివరీ అవుతారని వైద్య ఆరోగ్య శాఖ దగ్గర వివరాలున్నాయి. వీళ్లలో ఈ నెల 20 వరకు 29,991 మందికి డెలివరీ అయింది. రోజుకు సగటున 1,516 నుంచి 1,644 మంది వరకు డెలివరీ అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే పురిటి నొప్పులు మొదలయ్యాక అమ్మఒడి వాహనాలు, అంబులెన్స్లు సరైన టైమ్లో రాక, కొన్ని సందర్భాల్లో అసలే రాక గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. 108 అంబులెన్స్లను కరోనా సర్వీస్లకే వాడుతుండటంతో గర్భిణులను హాస్పిటళ్లకు తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉండట్లేదు. అమ్మఒడి వాహనాలు సరిపడా లేక కొన్నిసార్లు పోలీసులే తమ వాహనాల్లో గర్భిణులను హాస్పిటళ్లకు తరలిస్తున్నారు.
హై రిస్క్ డెలివరీలపై సర్కారు కేర్
రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి మే నెలాఖరు వరకు 30,222 హైరిస్క్ డెలివరీలున్నట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేశారు. మార్చి చివరి వారంలో 574, ఏప్రిల్లో 13,583.. మే నెలలో 16,065 హైరిస్క్ డెలివరీలుంటాయని గుర్తించారు. హైరిస్క్ డెలివరీ అయ్యే అవకాశమున్న మహిళలను ధైర్యంగా ఉంచేందుకు 108 కాల్ సెంటర్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. వారికి ఫోన్లు చేస్తూ ఆరోగ్యం ఎట్లుందని అడుగుతున్నారు. వాళ్లు ఉంటున్న ఇంటికి దగ్గరగా పీహెచ్సీ, హాస్పిటల్ ఉందా? ఎంతసేపట్లో హాస్పిటల్కు వెళ్లగలరు లాంటి వివరాలు
తెలుసుకుంటున్నారు.
గర్భిణులకు లాక్డౌన్ టెన్షన్
కొందరు గర్భిణులు లాక్డౌన్ డౌన్ టైమ్లో డెలివరీ ఎట్లా అని ఆందోళన చెందుతున్నారు. సరైన టైమ్లో హాస్పిటల్కు పోతమో లేదోనని భయపడుతున్నారు. డెలివరీ టైమ్లో మహిళల్లో సాధారణంగా టెన్షన్ ఉంటుందని, కానీ లాక్డౌన్ వల్ల బయటికెళ్లే చాన్స్ లేకపోవడం, పెద్దవాళ్లు వెంట లేకపోవడంతో వారిలో హైపర్ టెన్షన్ ఎక్కువవుతోందని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రశాంతంగా ఉండండి
ఇంట్లో పెద్దవాళ్లు లేకుండా భార్యభర్తలిద్దరే ఉన్నోళ్లలో యాంగ్జైటీ ఎక్కువుంది. డెలివరీపైనే వాళ్లు ఎక్కువ టెన్షను పడుతున్నారు. హై రిస్క్ డెలివరీ అవకాశమున్న వారితో 108 కాల్సెంటర్ నుంచి కౌన్సిలర్లు రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. డెలివరీ అయి ఇంటికెళ్లిన వారి ఆరోగ్య పరిస్థితి, శిశువులకు వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన పడొద్దు. సమస్య ఉంటే 108 కాల్ సెంటర్కు ఫోన్ చేయండి. గర్భిణులు ప్రశాంతంగా ఉంటేనే డెలివరీ సులువవుతుంది.
– డాక్టర్ నివేదిత, సైకియాట్రిస్ట్