
- పరీక్షలో ఫెయిల్ అవుతానని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
- సోమవారం నాటి ఫలితాల్లో 9.5 జీపీఏతో ఉత్తీర్ణత
- కుటుంబానికి తీరని శోకం మిగిల్చిన ‘భయం’
కాగజ్నగర్, వెలుగు:పాఠశాలలో బాగా చదివింది. తరగతి గదిలో తోటి విద్యార్థుల్లో ఆమె అన్నింటా పోటీ పడేది. ఈ క్రమంలో పరీక్షలు కూడా బాగానే రాసింది. పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లో వస్తున్నాయన్న తరుణంలో ఎలా ఆలోచించిందో తెలియదు కాని ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలువడ్డ వార్షిక ఫలితాల్లో ఆ విద్యార్థిని 9.5 జీపీఏ సాధించి ప్రథమ శ్రేణిలో పాస్ కావడం ఆ కుటుంబానికి మరింత బాధ కలిగించింది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మహ్మద్ అన్వర్, అంజుమ్కు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు . పెద్ద అబ్బాయి అనంత్ హైదరాబాద్లో డిగ్రీ చదువుతుండగా రెండో అబ్బాయి నవ్మన్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కూతురు ఫిజాఫిర్దోస్ పట్టణంలోని వీఐపీ పాఠశాలలో పదో తరగతి ఇటీవల పూర్తి చేసింది. ఈ క్రమంలో వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడేందుకు వారం రోజుల ముందు ఈ నెల 7వ తేదీన పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లోని బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ పోలీస్స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఫిర్దోస్ 9.5 జీపీఏ సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్సింగ్ తెలిపారు. క్షణికావేశంలో విద్యార్థి చేసుకున్న ఆత్మహత్య చాలా బాధకలిగించిందన్నారు.