
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
లక్సెట్టిపేట వెలుగు: ఉరి వేసుకొని ఓ టెన్త్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఇందుకు తండ్రితో పాటు మొదటి భార్య కుమారులపై అనుమానం ఉందని స్టూడెంట్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో సోమవారం జరిగింది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం...
పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన బత్తుల వెంకటి మొదటి భార్య చనిపోవడంతో నల్గొండ జిల్లా చిత్తలూరుకు చెందిన అరుణను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరి కూతురు జ్యోత్స్న (15) పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో టెన్త్ చదువుతోంది. అరుణ మూడు రోజుల కింద తన తల్లిగారింటికి వెళ్లగా... ఇంట్లో వెంకటితో పాటు జ్యోత్స్న ఉన్నారు.
సోమవారం ఉదయం జ్యోత్స్నఉరి వేసుకొని చనిపోయిందని వెంకటి మొదటి భార్య కుమారుడు చంద్రశేఖర్ అరుణకు ఫోన్ చేసి చెప్పడంతో సాయంత్రం వరకు అరుణ లక్సెట్టిపేటకు చేరుకుంది. తన కూతురు ఆత్మహత్యకు కారణాలు తెలియదని, అయితే తన భర్త వెంకటి, మొదటి భార్య కుమారులపై అనుమానం ఉందని అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.