బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక సీఎం ఎమోషనల్ ట్వీట్.. పది లక్షల పరిహారం

బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక సీఎం ఎమోషనల్ ట్వీట్.. పది లక్షల పరిహారం

బెంగళూరు: 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు కల నెరవేరిన వేళ ఆ జట్టును విషాదం వెంటాడింది. బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాలకు వెళ్లిన అభిమానుల్లో 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చిన స్వామి స్టేడియం దగ్గర ఈ తొక్కిసలాట దుర్ఘటన జరిగింది. కర్ణాటక ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించింది. ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత హృదయ విదారక ఘటన అని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ దుర్ఘటనపై ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ వార్త తనను షాక్కు గురిచేసిందని, ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందం ఈ దుర్ఘటనతో చెదిరిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. చిన స్వామి స్టేడియానికి అంచనాలకు మించి అభిమానులు రావడం వల్లే ఇలా జరిగిందని, ప్రేమాభిమానాల కంటే ప్రాణాలు ముఖ్యమని.. అన్నింటి కంటే ముందు మన భద్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆయన ట్వీట్లో హితవు పలికారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ తొక్కిసలాటపై కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. అదుపు చేయలేనంత మంది అభిమానులు వచ్చారని, పోలీసులు అప్పటికీ పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారని డీకే మీడియాకు తెలిపారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తారు. అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో.. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు లాఠీ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. పెద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు.

చిన స్వామి స్టేడియం 18, 19, 20వ నంబర్ గేట్లు ఓపెన్ చేయడంతో అభిమానులు దూసుకొచ్చారు. అక్కడి నుంచి ఆర్సీబీ టీం స్టేడియంలోకి వస్తున్నారని తెలిసి.. 12వ నెంబర్ గేట్ దగ్గరకు అభిమానులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. భారీ తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడం, పాసులతో సంబంధం లేకుండా స్టేడియంలోకి అభిమానులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఆర్సీబీ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది.