ఉత్తరప్రదేశ్ : ఉన్నావ్ రేప్ కేసులతో తరుచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. గతేడాది డిసెంబర్లో ఓ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా అడ్డగించిన నిందితులు.. ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ఆమెను లక్నో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తాజాగా ఉన్నావ్లో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్తులంతా హోలీ వేడుకల్లో బిజీగా ఉన్నవేళ మంగళవారం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
వివరాలు:
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్లో మూడో తరగతి చదువుతున్న బాలిక(12) హోలీ పండగ రోజు.. ఇంటి బయట నిలబడి హోలీ వేడుకలను చూస్తోంది. ఇంతలో ఓ యువకుడు ఆమెను తనవైపు రమ్మని సైగ చేశాడు. అతని మనసులో ఏముందో తెలియని ఆ చిన్నారి.. అమాయకంగా అతని వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఆ బాలికను పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బలంగా ఆమె గొంతు నులిమాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
చికిత్స పొందుతూ మృతి
అటుగా వెళ్లిన కొంతమంది గ్రామస్తులు.. బాలిక అక్కడ పడిపోయి ఉండటాన్ని గమనించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను వెంటనే స్థానికుల సాయంతో కాన్పూర్ లోని హలెట్ హస్పిటల్ కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హస్పిటల్ ముందు ఆందోళన చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని చెప్పారు పోలీసులు.