
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద పారా అథ్లెటిక్స్ పండగకు రంగం సిద్ధమైంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 12వ ఎడిషన్ శనివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మొదలవనుంది. ఈసారి రికార్డు స్థాయిలో 104 దేశాల నుంచి 2200 మందికి పైగా అథ్లెట్లు, అధికారులు పాల్గొంటారు. 186 మెడల్ ఈవెంట్లలో 1500 మందికి పైగా అథ్లెట్లు బరిలో నిలిచారు.
పారిస్ పారాలింపిక్స్లో 308 మెడల్స్ గెలిచిన 100 మందికి పైగా టాప్ అథ్లెట్లు పోటీలో ఉన్నారు. 74 మంది అథ్లెట్లతో పోటీకి సిద్దమైన ఇండియా మెడల్స్ పట్టికలో టాప్ –5లో నిలవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈసారి 20కి పైగా మెడల్స్ ఆశిస్తోంది. 2024 ఎడిషన్లో విమెన్స్ 400 మీటర్ల టి20 కేటగిరీలో గోల్డ్ నెగ్గిన తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి, మెన్స్ జావెలిన్ (ఎఫ్64) డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్, పారిస్ పారాలింపిక్స్ మెన్స్ హై జంప్ విన్నర్ ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ అథ్లెట్లు ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు.