మయన్మార్‍లో పాఠశాలలే లక్ష్యంగా సైన్యం దాడులు

మయన్మార్‍లో పాఠశాలలే లక్ష్యంగా సైన్యం దాడులు

మయన్మార్ లో ఓ పాఠశాలపై సైనిక హెలికాపర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు చనిపోగా, 13మంది తీవ్రంగా గాయపడ్డారు. సాగింగ్ లోని లెట్ యట్ కోనే గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పాఠశాలలో రెబల్స్ దాగి ఉన్నారన్న కారణంతోనే తాము కాల్పులు జరిపినట్టు మయన్మార్ సైన్యం తెలిపింది. బౌద్ధమఠాన్ని ఆధారంగా చేసుకొని పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ గ్రూపుకు చెందిన రెబల్స్ ఆయుధాలు రవాణా చేస్తున్నారని ఆరోపించింది. అందుకోసం తనిఖీలకు వచ్చిన సైనిక హెలికాప్టర్లపై దాడి చేయడంతో..సైన్యం ప్రతిదాడి చేసిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రెబల్స్, ప్రజలను మరో ఆయుధంగా వాడుకుంటున్నారని సైన్యం ఆరోపించింది. ఇక ఈ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా ఆ గ్రామంలోని ఓ బౌద్ధమఠంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో కొందరు పిల్లలు అక్కడికక్కడే చనిపోవడం అందర్నీ కలచివేస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను సైన్యం అక్కడ్నుంచి 11కి.మీ.ల దూరంలోని ఓ టౌన్ షిప్ కు తీసుకెళ్లి పూడ్చిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే మయన్మార్ సైన్యం కావాలనే పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోందని నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అనే సంస్థ ఆరోపించింది.