
చిన్నప్పటి నుంచి ఆటిజంతో బాధపడుతోంది. మాటలు కూడా సరిగా రావు. నలుగురిలో కలిసేది కాదు. ఆ సమస్య నుంచి కోలుకునేందుకు థెరపీలో భాగంగా ఈత నేర్చించారు డాక్టర్లు. దాంతో, చిన్నప్పటి నుంచే నీళ్లతో ఫ్రెండ్షిప్ చేసింది. ఇప్పుడు ఈత పోటీల్లో రికార్డులు సృష్టిస్తోంది. తన పేరు జియా రాయ్. ఈమధ్యే శ్రీలంక, ఇండియా మధ్య ఉన్న పాక్ జలసంధిలో 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 10 నిమిషాల్లో ఈది రికార్డు సాధించింది.
ఈ 13 ఏండ్ల ఈ పారా స్విమ్మర్ గురించి...
శ్రీలంకలోని తలైమన్నార్ దగ్గర ఈ ఆదివారం (మార్చి20న) ఉదయం 4:22 కు ఈత మొదలుపెట్టి, సాయంత్రం 5: 32కి మనదేశంలోని ధనుష్కొడి ప్రాంతానికి చేరుకుంది. ఈ స్విమ్మింగ్ జర్నీలో జియాకు ఏ ప్రమాదం జరగకుండా చూసుకున్నారు శ్రీలంక నేవీ, ఇండియన్ కోస్ట్గార్డ్ వాళ్లు. జియా రాయ్ తండ్రి మదన్ రాయ్ ఇండియన్ నేవీలో ఆఫీసర్. తల్లి రచన కెమిస్ట్రీ టీచర్. తమ కూతురికి ఆటిజం అని తెలియగానే మొదట్లో బాధపడ్డారు. డాక్టర్ల సలహాతో జియాకి స్విమ్మింగ్ నేర్పించారు. అప్పటినుంచి ఇంట్లో ఉన్నా, ప్లే స్కూల్లో ఉన్నా నీళ్ల బకెట్లో చేతులు పెట్టి ఆడుకునేది జియా. అలాంటిది తను స్విమ్మర్ అవుతుందని పేరెంట్స్ ఊహించలేదు. అయితే, స్కూల్లో ఈత పోటీల్లో ఫస్ట్ వచ్చి, అందర్నీ ఆశ్చర్యపరిచింది జియా. దాంతో, కూతురు స్విమ్మింగ్లో మరింత మెరుగుపడేందుకు కోచ్ని పెట్టారు.
తల్లి జాబ్ మానేసి కోచ్గా...
కోచ్ చెప్పే విషయాలు జియాకు తొందరగా అర్థం అయ్యేవి కావు. దాంతో కోచ్ చెప్పినవి, కూతురికి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆమె తల్లి టీచర్ జాబ్ మానేసింది. 2019లో గుజరాత్లోని పోర్బందర్లో ‘నేషనల్ ఓపెన్ వాటర్ సీ ఛాంపియన్షిప్’ జరిగింది. అప్పుడు జియాకు పదేండ్లు. ఆ పోటీల్లో 14 ఏండ్ల వాళ్లకే ఎంట్రీ ఉంది. అయితే, జియా స్విమ్మింగ్ స్కిల్స్ చూసి, స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. 5 కిలోమీటర్ల పోటీలో ఫస్ట్ వచ్చింది జియా. పోయిన ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని బాంద్రా–వర్లీ మధ్య 36 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 40 నిమిషాల్లో ఈదింది. ఈ ఫీట్ సాధించిన మొదటి స్పెషల్ చైల్డ్గా రికార్డు సాధించింది జియా.
24 గోల్డ్ మెడల్స్
గత మూడేండ్లలో నేషనల్, స్టేట్ లెవల్ స్విమ్మింగ్, ఓపెన్ వాటర్ సీ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్లో 24 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ గెలిచింది. మానసిక ఆరోగ్యం సరిగా లేకున్నా స్విమ్మింగ్లో రాణిస్తున్న జియాకు ఈ ఏడాది ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం ఇచ్చారు. ప్రపంచంలోని ఏడు సముద్రాల్ని ఈదిన మొదటి పారా స్విమ్మర్గా గుర్తింపు తెచ్చుకోవాలన్నది జియా కల అంటున్నాడు ఆమె తండ్రి మదన్ రాయ్.