మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అధికార, ప్రతిపక్షాల సభ్యుల వాగ్వాదంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ అసహనం వ్యక్తం చేశారు. సభలో ఇలా ప్రవర్తించడం వల్ల చెడ్డ పేరు వస్తుందన్నారు. సభ నడిచే తీరుపై ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పారు. మీరు చేస్తున్నది చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటున్నారని అధికార, ప్రతిపక్ష సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ వెలుపల జరిగిన దాని గురించి సభలో ఆందోళనలు సరికాదన్నారు. మనమేం చిన్నపిల్లలం కాదంటూ సభ్యులపై జగదీప్ ధన్ కర్ మండిపడ్డారు.
కేంద్రమంత్రులకు, ఖర్గేకు మధ్య పార్లమెంట్ లో డైలాగ్ వార్ నడిచింది. బీజేపై చేసిన వ్యాఖ్యలపై ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఖర్గే మాత్రం తాను పార్లమెంట్ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని, ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టబడే ఉన్నానని తెలిపారు. దేశం కోసం బీజేపీ నుంచి ఎవరు ప్రాణ త్యాగం చేయలేదన్నారు ఖర్గే. అధికారపక్షం, ప్రతిపక్షాల వాదనలతో రాజ్యసభలో వాయిదాల పర్వం నడిచింది.