
న్యూఢిల్లీ: ఆగ్రా నుంచి తిరిగి వచ్చిన 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో క్వారంటైన్ కు తరలించినట్లు చత్తీస్గఢ్ అధికారులు వెల్లడించారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించామని, రిపోర్టులకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఆగ్రాలోని పోలీస్ లైన్స్ వద్ద క్యాంప్ లో ఉన్న బీఎస్ ఎఫ్ దళాలు ఆదివారం చత్తీస్గఢ్ లోని భిలాయ్ కు చేరుకున్నాయి. వీరు ఆగ్రాలో బస చేసిన క్యాంప్ వంటమనిషికి వైరస్ సోకిందన్న సమాచారం మేరకే 14 మంది జవాన్లను క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇందులో ఇద్దరిని దుర్గ్ జిల్లాలోని ఐసోలేషన్ సెంటర్కు మిగిలిన వారిని భిలాయ్ స్టీల్ ప్లాంట్ లోని క్వారంటైన్ సెంటర్ కు తరలించామన్నారు. లాక్డౌన్ కాలంలో జవాన్లను కదలికలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ తన కమాండర్లకు, సిబ్బందికి ఇప్పటికే ఆదేశించారు.