- సెప్టెంబర్లో 15.41 లక్షల అకౌంట్లు యాడ్ అయ్యాయి
- ఇందులో 8.95 లక్షలు కొత్తవే..
- 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ
- ఇక పీఎఫ్ డిపాజిట్లు ఇన్విట్లోకి..
బిజినెస్ డెస్క్, వెలుగు: ఈపీఎఫ్ఓ సబ్స్క్రయిబర్లు భారీగా పెరుగుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సుమారు 15.41 లక్షల పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇందులో 8.95 లక్షల అకౌంట్లు కొత్తవి కావడం విశేషం. పీఎఫ్ సబ్స్క్రయిబర్ జాబ్ మారడం వలన మరో 6.46 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్ట్తో పోల్చుకుంటే సెప్టెంబర్లో 1.81 లక్షల అకౌంట్లు ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. ఆగస్ట్లో 13.60 లక్షల మంది సబ్స్క్రయిబర్లు యాడ్ అయ్యారని ఈపీఎఫ్ఓ డేటా ద్వారా తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ జాబ్లో జాయిన్ అయిన వారు పెరుగుతున్నారని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఏజ్ పరంగా చూస్తే 22–25 ఏళ్ల మధ్య ఉన్నవారు సెప్టెంబర్లో 4.12 లక్షల మంది యాడ్ అయ్యారు. 18–21 ఏళ్ల మధ్య వయసున్న వారు 3.18 లక్షల అకౌంట్లతో తర్వాత ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ టైమ్ జాబ్లో జాయినయ్యే వారు ఆర్గనైజ్డ్ సెక్టార్ను ఎంచుకుంటున్నారని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్లో యాడ్ అయిన సబ్స్క్రయిబర్లలో యువత వాటా 47.39 శాతంగాఉందని తెలిపింది.
మహిళల వాటా పెరుగుతోంది..
మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఈపీఎఫ్ఓలో సబ్స్క్రయిబ్ అయ్యారు. సెప్టెంబర్ డేటాలో ఈ రాష్ట్రాల వాటా 9.41 లక్షల సబ్స్క్రయిబర్లు. ఇది నికరంగా యాడ్ అయిన సబ్స్క్రయిబర్లలో 61 శాతానికి సమానం. మహిళలు జాబ్స్ చేయడం పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో 3.27 లక్షల మంది మహిళా సబ్స్క్రయిబర్లు యాడ్ అయ్యారని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ‘నెల వారీగా చూస్తే మహిళా సబ్స్క్రయిబర్ల సంఖ్య సెప్టెంబర్లో 60 వేలు పెరిగింది. ఆగస్ట్లో 2.67 లక్షల మంది మహిళా సబ్స్క్రయిబర్లు యాడ్ అయ్యారు’ అని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఏయే జాబ్స్ పెరిగాయో కూడా ఈ సంస్థ వెల్లడించింది. మ్యాన్ పవర్ను అందించే సంస్థలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు వంటి ఎక్స్పర్ట్ సర్వీసెస్ కేటగిరీలో జాబ్స్ పెరిగాయి. సెప్టెంబర్లో యాడ్ అయిన మొత్తం సబ్స్క్రయిబర్లలో ఈ కేటగిరీ వాటా 41.22 శాతంగా ఉంది. ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, టెక్స్టైల్స్, గార్మెంట్ మేకింగ్, హాస్పిటల్స్, ఫైనాన్షింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ట్రేడింగ్–కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి ఎక్కువ మంది సబ్స్క్రయిబర్లు యాడ్ అయ్యారని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
సెంట్రలైజ్డ్ ఐటీ-సిస్టమ్..
సెంట్రలైజ్డ్ ఐటీ–సిస్టమ్ను డెవలప్ చేయడానికి కూడా సీబీటీ మీటింగ్లో ఆమోదం దొరికింది. ఈ వ్యవస్థను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డెవలప్ చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ వలన డ్యూప్లికేషన్ తగ్గుతుంది. పీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఉన్నా అన్నిటిని ఒకే అకౌంట్ కింద కలపడానికి వీలుంటుంది.
ఇన్విట్లో ఈపీఎఫ్ఓ ఫండ్స్..
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్), ఇతర ఆల్టర్నేటివ్ ఫండ్స్లలో ఈపీఎఫ్ఓ డిపాజిట్లలో 5 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అంగీకరించింది. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్ఐఏసీ) ఏ అసెట్లలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయిస్తుంది. సెంటర్ చెప్పే ప్యాటర్న్ను బట్టి ఈ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ తన డిపాజిట్లలో 45–50 శాతం వరకు ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తోంది. 35–45 శాతం డెట్ అసెట్లలో (బాండ్లు వంటివి), 5 –15 శాతం వరకు షేరు మార్కెట్లో, 10 శాతం వరకు షార్ట్ టెర్మ్ డెట్ అసెట్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఈపీఎఫ్ఓ దగ్గర డిపాజిట్లు ఏటా పెరుగుతున్నాయి. దీంతో ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను కూడా ఈ సంస్థ వెతుకుతోంది. ఇన్విట్తో కలిపి ఆల్టర్నేటివ్ అసెట్లలో ఐదు శాతం వరకు ఇన్వెస్ట్ చేయడానికి ఈపీఎఫ్ఓకి ప్రస్తుతం అవకాశం దొరికింది. ఇన్విట్ను లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్గా పనిచేస్తుంది. కానీ, రిస్క్లు కూడా ఉంటాయి.