
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఒక్కరోజులోనే 71 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,074 కు చేరుకుంది. వైరస్ బాధితుల సంఖ్య 33,050 కు చేరుకుంది. వైరస్ బాధితుల్లో ఇప్పటివరకు 24 శాతం (8,325 )మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవించలేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏడుగురికి కరోనా సోకినట్లు వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజులోనే 206 కేసులు నమోదయ్యాయి. ముంబైలో గడిచిన 24 గంటల్లో 26 మంది చనిపోగా.. 475 కొత్త కేసులు ఫైల్ అయ్యాయి. దీంతో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 6,457 కు చేరుకుంది. చనిపోయిన వారి సంఖ్య 270 కి పెరిగింది. మహారాష్ట్రలో నూ వైరస్ విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే 597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 32 మంది చనిపోయారు. రాజస్థాన్ లో రాజస్థాన్ 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,438 కు చేరుకుంది. తమిళనాడులో 104, గుజరాత్ లో 308, ఉత్తరప్రదేశ్ లో 81కేసులు ఒక్కరోలోనే నమోదయ్యాయి.