
పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 1,869 ఫిర్యాదులు వచ్చాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి పాల్గొని జనంతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాలతో ఆర్టీసీలో డ్రైవర్లుగా, కండెక్టర్లుగా, మెకానిక్లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహించిన 1300 మందిని గత ప్రభుత్వం డిస్మిస్ చేసిందని, అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని పలువురు చిన్నారెడ్డిని వేడుకున్నారు. టీఎస్పీఎస్సీలో ఆరేండ్లుగా పెండింగ్లో ఉన్న పారామెడికల్ ల్యాబ్ టెక్నిషియన్స్ఉద్యోగాల తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని జి.విజయ్కుమార్ అనే వ్యక్తి కోరాడు. హౌస్కీపింగ్పనులు చేసే తమకు సాయినాథ్ఏజెన్సీ 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని 100 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్జిల్లా గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న పార్ట్టైం, శానిటేషన్సిబ్బందికి 10 నెలలుగా జీతాలు ఇవ్వలేదని జిల్లా గిరిజన సంక్షేమశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఐదేండ్లకోసారి వేతనంలో 25 శాతం పెంచాలని పలువురు అంగన్ వాడీలు కోరారు. ఘట్కేసర్మండలం నారపల్లికి చెందిన దాసమ్మ అనే మహిళ ప్రజాభవన్నుంచి బయటకు వస్తున్న మంత్రి సీతక్క కాళ్లపై పడింది. తనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారని, వారికి ఉద్యోగం ఇప్పించాలని,
డబుల్బెడ్రూమ్ ఇల్లు కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది. న్యాయం చేస్తామని మంత్రి సీతక్క ఆమెకు హామీ ఇచ్చారు. కాగా, యోహోన్ సిరిమల్ల అనే యువకుడు ప్రజాభవన్మీడియా సెంటర్వద్ద కలకలం సృష్టించాడు. ‘నాది మల్లాపూర్ గ్రామం. కీసర పోలీసులు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈ విషయం సీఎంతో చెప్పాలి. ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్లో చనిపోలేదు. చంపేశారు’ అంటూ వాపోయాడు.